నేడు ఏపీ క్యాబినెట్ భేటీ: కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారంతో పాటు కీలక అంశాలపై చర్చ
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది.ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి కొన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది . ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం ఒకటో బ్లాక్లో జరగనున్న క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారంపై కేంద్రం కొత్త పల్లవి అందుకున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
ప్రాజెక్ట్ ల విషయంలో ప్రధానంగా చర్చ
ఇప్పటివరకు కృష్ణా, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర సహాయాన్ని కోరడానికి కూడా కేబినెట్ చర్చించనుందని సమాచారం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి క్యాబినెట్ సంతాపం ప్రకటించనుంది. కృష్ణా డెల్టా ఆయకట్టు నుండి రక్షించడం కోసం ప్రకాశం బ్యారేజ్ కింద మరో రెండు బ్యారేజీల నిర్మాణం, వాటి సాధ్యాసాధ్యాలపై క్యాబినెట్లో విస్తృతంగా చర్చ జరగనుంది. అంతేకాకుండా రాయలసీమ కరువు నివారించడం కోసం చేపట్టిన ప్రాజెక్టు కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం
రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ లో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల నియామక ప్రక్రియకు సంబంధించిన చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒకరు చొప్పున 51 డీడివో పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి సంబంధించి నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కూడా నేడు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Recommended Video
వరద సాయం కోసం , జీఎస్టీ పరిహారంపై కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
కృష్ణ, గోదావరి వరదల వల్ల ముంపు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది . భారీ నష్టం జరిగిన నేపధ్యంలో ఏపీప్రభుత్వం బాధితులకు పరిహారం అందించే విషయంలో కేంద్ర సహాయం కోరే విషయంపై క్యాబినెట్ లో చర్చించనుంది. ఇక రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఇవ్వకుండా కేంద్రం కొత్త దారులు వెతుకుతున్న వేళ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా నేడు చర్చించనుంది ఏపీ క్యాబినెట్.
అలాగే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, కరోనా నియంత్రణ కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న కోవిడ్ నియంత్రణ చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది.