రేపు ఏపీ కేబినెట్ భేటీ- అసెంబ్లీ, కొత్త జిల్లాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చే అజెండా..
ఏపీ ఇళ్ల స్ధలాల పంపిణీ, కొత్త జిల్లాల ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గం రేపు సమావేశం కాబోతోంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులో చర్చించే అంశాలను వివిధ శాఖల నుంచి వచ్చిన అంశాల ఆధారంగా ఖరారు చేశారు.
సీఎం జగన్ అధ్యక్షతన రేపు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది ఇందులో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, పెండింగ్లో ఉన్న బిల్లులు ఉన్నాయి. వీటి అజెండాను కేబినెట్లో ఖరారు చేసే అవకాశముంది. దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుతో పాటు పలు బిల్లులను అసెంబ్లీ అజెండాలో చేర్చాల్సి ఉంది. దీంతో పాటు మరికొన్ని కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వీటిపై కేబినెట్లో చర్చ అనంతరం ఖరారు చేస్తారు.
మరోవైపు ఏపీలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది క్రిస్మిస్ రోజైన డిసెంబర్ 25న పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కేబినెట్లో ఖరారు చేసే అవకాశముంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి. అలాగే ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది. ఇప్పటికే జిల్లాల పునర్విభజన కోసం నియమించిన రెండు కమిటీలు తమ నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీటికి కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే వచ్చే జనవరి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి.