వారికి శుభవార్త: కేబినెట్ కీలక నిర్ణయాలు, గడ్కరీతో కలిసి బాబు వెళ్లాలా వద్దా?
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను సాధించుకోవడంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై న్యాయపోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. విభజన హామీల అమలుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని, సొంతంగా పిల్ దాఖలు చేసేందుకు నిర్ణయించామన్నారు. సమాచార రంగంలో ఏళ్ల తరబడి సేవలందిస్తోన్న జర్నలిస్టులకు గృహ వసతి కల్పనకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందన్నారు.
తాము ఇప్పటికే ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, గృహ నిర్మాణశాఖకు రూ.1,480కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే, ఆక్రమణకు గురయి అభ్యంతరాల్లేని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. విశాఖపట్నంలో ప్రపంచస్థాయి క్రీడానగరం కోసం భూసమీకరణకు మంత్రిమండలి అనుమతినిచ్చిందన్నారు.
కేంద్రం అఫిడవిట్ ద్వారా సుప్రీంకు అసత్యాలు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. న్యాయనిపుణులతో చర్చించి ముందుకు సాగుతామన్నారు. న్యాయపోరాటంపై కేబినెట్ ఏకాభిప్రాయం తెలిపిందన్నారు.
నితిన్ గడ్కరీ సందర్శనపై ఆసక్తికర చర్చ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ త్వరలో ఏపీకి రానున్నారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. దీనిపై కేబినెట్లో ఆసక్తికర చర్చ సాగింది. బీజేపీ ఎంపీ, ఆ పార్టీ నేతలతో గడ్కరీ పోలవరం సందర్శనకు వెళ్తే చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
గడ్కరీ షెడ్యూల్లో సీఎంతో కలిసి పాల్గొంటారని చెప్పారని అధికారులు తెలిపారు. గడ్కరీ షెడ్యూల్లో అలా ఉంటే వెళ్తేనే మంచిదని మరికొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. పోలవరం ఏపీకి సంబంధించిన వ్యవహారమని, కాబట్టి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిప్రాయాలు చెప్పాలని ఇంకొందరు అన్నారు.