ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. శనివారం సాయంత్రం సచివాలంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020 నాటికి రాష్ట్రానికి రూ.32,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రూపొందించిన క్లౌడ్ హబ్ పాలసీ 2018-20కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శనివారం సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో సంక్షేమ పథకాలతో పాటు.. ఉపాధి కల్పన, పరిశ్రమలను ఆకర్షించడం సహా పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆదరణ పథకం కింద రూ.300 కోట్లతో 2.5 లక్షల మంది బీసీలకు పనిముట్లు అందజేయాలని నిర్ణయించారరు. 3 శ్లాబుల్లో రూ.30 వేలు, 20 వేలు, రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందజేయనున్నారు.
కృష్ణా జిల్లా ఆత్కూరులో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖలో 50 పోస్టుల భర్తీకి, విద్యుత్ శాఖలో 400 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా.. రైతు సాధికార సంస్థ రూ. 1000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కూడా మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.
అలాగే పీపీపీ విధానంలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి, పీపీపీ విధానంలో భావనపాడు పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది.
ఇంకా క్లౌడ్ హబ్ పాలసీ 2018-20కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పాలసీ రూపకల్పన, ఉద్యోగాల కల్పన ఆధారంగా రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
అలాగే రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. విశాఖలో ఏర్పాటుకానున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు ఐటి పాలసీలోని ప్రత్యేక రాయితీలు కల్పించాలని కూడా ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.