నేడు ఎపి కేబినెట్ మీటింగ్:అగ్రిగోల్డ్ తో సహా పలు కీలక నిర్ణయాలు
అమరావతి: ఎపి కేబినెట్ మీటింగ్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ కేసు విషయమై అన్ని కోణాల్లో సమగ్ర చర్చ జరిపి ఈ కేసు విషయమై హైకోర్టులో ఎలా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణకు గన్నవరంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు రాగా ఈ సమావేశంలోనే మంత్రి వర్గం దాన్ని ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల తరువాత తొలిసారిగా సోమవారం ఈ మంత్రివర్గ సమావేశం జరగనుండటం గమనార్హం. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దాదాపుగా కేబినేట్ మంత్రులు అందరూ పాల్గొంటారని తెలిసింది. సోమవారం ఉదయం సీఎం నివాస గృహంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా సాయంత్రం సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయంలో మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది.
అగ్రిగోల్డ్ ఆస్తులను తీసుకోవడానికి జీఎస్ఎల్ గ్రూప్ వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం చెల్లించే విషయం, ఎమ్మల్యేలపై కేసుల విచారణకు గన్నవరంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు వంటి అంశాలతో పాటు ఎన్నికల హామీల్లో ముఖ్యమైన నిరుద్యోగ భృతి, పలు సంస్థలకు భూకేటాయింపుల పై నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర విషయాలపై కూడా నేటి కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది.