నేడు కేబినెట్ భేటి:కేంద్రం అఫిడవిట్ పై చర్చే ప్రధానాంశం!
Recommended Video
అమరావతి: శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు అంతకంతకూ సమీపిస్తున్న ఈ తరుణంలో ఇక ప్రతి కేబినెట్ భేటీ లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
ముఖ్యంగా సంక్షేమ, జనాకర్షక పధకాలకు సంబంధించిన ప్రకటనలు ఇకపై జరగబోయే ప్రతి మంత్రివర్గ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది. నేటి కేబినెట్ భేటీ విషయానికొస్తే ఏపీకి విభజన చట్టంలో ఉన్నవి అన్నీ అమలు చేశామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగ భృతి మార్గదర్శకాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
ఈ అంశమే...కీలకం
ఏపీకి విభజన చట్టంలో ఉన్నవి అన్నీ అమలు చేశామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రులు, సీనియర్ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి అందిన సాయంపై సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంపై కూడా నేడు రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మరోవైపు కేంద్రం తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నిరుద్యోగ భృతిపై...తీపికబురు
తాజా కేబినెట్ సమావేశం తరువాత నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న నిరుద్యోగ భృతి అంశంపై ఈ కేబినెట్లో కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల వాగ్దానంలో ముఖ్య భూమిక పోషించిన వాగ్దానం ఇది. గడచిన నాలుగేళ్లుగా ఈ పథకం అమలుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తోంది. అయితే, గడచిన మూడు నాలుగు నెలలుగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పలు దఫాలుగా రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, న్యాయ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పలుసార్లు అధికారులతో సమావేశమై విధివిధానాలు రూపొందించిన సంగతి విదితమే.
నిరుద్యోగ భృతిపై...విధివిధానాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో 18 నుండి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిని 10 లక్షల మంది నిరుద్యోగులను గుర్తించి వారికి ఈ భృతి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, పక్క రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్న తీరుపై అధ్యయనం చేసి ఆ తరువాత ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగ భృతికి అర్హత ఉందా లేదా అనే అంశం తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక యాప్ను తయారు చేశారు. ఈ యాప్లో ఆధార్ నెంబరు టైప్చేస్తే సదరు వ్యక్తికి నిరుద్యోగ భృతి పొందే అర్హత ఉందా లేదా అనే అంశం స్పష్టమౌతుంది. ఇందులో సదరు అభ్యర్ధికి ఎటువంటి అనుమానాలైనా ఉంటే 1100కు ఫిర్యాదుచేసేలా కార్యాచరణ రూపొందించారు.
మళ్లీ...ప్రజల వద్దకే పాలన
ప్రజలవద్దకే పరిపాలన అనేది పాత నినాదమే అయినప్పటికీ మరోసారి దాన్నే సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇదే అంశంపై నేటి కేబినెట్ భేటీలో సహచర మంత్రులతో చర్చించి మరిన్ని కొత్త విధానాలు రూపొందించనున్నారని తెలిసింది. వారంలో ఇక నుండి 3 రోజులపాటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేలా చాడాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. తాను కూడా రాష్ట్రంలోని 174 నియోజకవర్గాలు పర్యటించి అభివృద్ధి పథకాల పనితీరును సమీక్షిస్తానని, ఆ విషయం నేటి కేబినెట్ భేటీలో చెప్పే అవకాశం ఉందని తెలిసింది. దీనితోపాటు కొన్నిచోట్ల బీజేపీ నేతల పట్ల తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ముఖ్యమంత్రి సహచర మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం.