ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు- ఆన్లైన్ రమ్మీ, మావోలపై నిషేధం, విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం..
ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్ రమ్మీ నిషేధం, రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం అమలుతో పాటు పలు అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే బాపట్ల, మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు చేసినా ఒక్క రైతుకూ నష్టం లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆన్లైన్ రమ్మీ నిషేధం
ఏపీలో పేదల బతుకులను చిదిమేస్తున్న ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి క్రీడలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఇవాళ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆన్లైన్ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలలు జైలు శిక్ష విధించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆన్లైన్ రమ్మీ, పోకర్ నిర్వాహకులకు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా విధించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల సమన్వయం కోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉచిత విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం
కేంద్రం చెపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న కనెక్షన్లకు మీటర్లు బిగించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ అమలు చేయడంతో పాటు ఫీడర్ల అభివృద్ధికి రూ.1700 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో గుర్తించిన లక్ష అనధికారిక ఉచిత విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అభివృద్ది పథకాలకు ఆమోదం...
విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలోరూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. అలాగే రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్ట ప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్ సుజల స్రవంతి పథకం అమలు చేసేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బాబూజగజ్జీవన్ రామ్ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.
Recommended Video
మావోయిస్టులపై నిషేధం పొడిగింపు
రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కదలికలను దృష్టిలో ఉంచుకుని మావోలపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.బాపట్ల, మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ నిధులపై కేంద్రం నుంచి సహకారం అందకపోవడంపై కేంద్రాన్ని ఎంపీలు ప్రశ్నిస్తున్నారని మంత్రి పేర్నినాని తెలిపారు. అలాగే ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలపైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.