ఏపీ కేబినెట్ నిర్ణయాలు- సినీ, టూరిజం రంగాలకు ప్యాకేజీ- టూరిజం పాలసీకి ఆమోదం
అమరావతిలో ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో రైతు భరోసా మూడో విడత మొత్తం విడుదలతో పాటు ఇతర నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్రంలో సమగ్ర భూసర్వేతో పాటు టూరిజం పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే సినీ, పర్యాటక రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అదనపు అడ్వకేట్ జనరల్గా జాస్తి నాగభూషణం నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భూసర్వేతో పాటు ఇళ్ల స్ధలాల పంపిణీ కూడా పారదర్శకంగా చేపడుతున్నట్లు మంత్రి పేర్నినాని వెల్లడించారు.
మూడో విడత రైతు భరోసాకు గ్రీన్సిగ్నల్
ఏపీలో ఇవాళ సమావేశమైన మంత్రివర్గం.. మూడో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సీజన్లో రైతు భరోసా కింద రైతులందరికీ రూ.2 వేల చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. మూడో విడత రైతు భరోసాతో 50 లక్షల 47 వేల మంది రైతులకు లబ్ది కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29న రైతు భరోసా మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. దీంతో పాటు నివర్ తుపాను బాధిత రైతులకు పరిహారం కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నివర్ తుపాను 8 లక్షల మందికి పైగా రైతులు నష్టపోయినట్లు ప్రభుత్వం అంచనా వేశారు. నివర్ తుపాను కారణంగా 13 లక్షల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
అభివృద్ధి పనులకు ఆమోదం..
రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖలో 149 ల్యాబ్ టెక్నీషియన్లు, 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే పులి వెందులలో కేంద్రం ఆమోదించిన ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో 27 మెడికల్ కాలేజీలకు రూ.16 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.1937 కోట్ల రుణానికి గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ షెడ్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. అదనపు అడ్వకేట్ జనరల్గా జాస్తి నాగభూషణం నియమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కొత్త టూరిజం పాలసీ, భూసర్వేకి ఆమోదం
రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆహ్వానించేలా కొత్త టూరిజం పాలసీ రూపొందించారు. పెట్టుబడిదారులకు పలు మినహాయింపులతో టూరిజం పాలసీ రూపకల్పన చేశారు. అలాగేటూరిజం పాలసీలో మెగాటూరిజం యూనిట్ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 21 నుంచి చేపట్టే సమగ్ర భూసర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ కోర్టుల ఏర్పాటుతో భూ యజమానుల ప్రయోజనాలు కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హోటల్, సినీ పరిశ్రమలకు ప్యాకేజీ..
రాష్ట్రంలో కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోటల్, సినీ పరిశ్రమలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హోటల్ పరిశ్రమ తిరిగి తెరుచుకునేందుకు రూ.139.05 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమకు కూడా ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు సాయం చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. అలాగే థియేటర్లు బాగుచేసుకునేందుకు చిన్న, మధ్యతరహా రంగం కింద చేయూత ఇవ్వబోతోంది. మల్టీప్లెక్స్ల సహా అన్ని థియేటర్లకు ఏప్రిల్,మే, జూన్ నెలలకు ఫిక్స్డ్ పవర్ ఛార్జీలు రద్దు చేయనున్నారు. ప్రస్తుత క్వార్టర్లో ఫిక్స్డ్ పవర్ ఛార్జీల చెల్లింపు వాయిదాకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 1100 ధియేటర్లకు లబ్ది కలగనుంది. ఏ,బీ సెంటర్లలో థియేటర్లకు రూ.10 లక్షలు, సీ సెంటర్లలో థియేటర్లకు రూ.5 లక్షల రుణాలు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రుణాలపై మారటోరియం అవకాశం కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.