రాజధాని పేరు అమరావతి ఖరారు, 99 ఏళ్ల పాటు భూమి లీజు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు అమరావతిగా ఖరారు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మంత్రివర్గం నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలిపింది. మిగతా రాష్ట్రాలతో సమాన హోదా వచ్చే వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి మంగళవారం నాడు నిధులు విడుదల చేసినందుకు కేబినెట్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. 99 ఏళ్ల బాటు భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.
రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఐదేళ్ల పాటు వ్యాట్, జీఎస్పీ రీయింబర్సుమెంట్స్ చేయాలని నిర్ణయించింది. స్వచ్ఛ, గ్రీన్ ఆంధ్రప్రదేశ్లకు సహకరించే వారికి మరికొన్ని రాయితీలు ఇవ్వనుంది. రాష్ట్రంలో ఐదు పారిశ్రామిక నగరాలకు ప్రాధాన్యం.