పితానికి పదవిపై ఫైర్: రిజైన్ చేసి పార్టీ పెడ్తానని చింతమనేని, బండారు ఫోన్ స్విచ్ఛాఫ్
అమరావతి: పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
రాజీనామా ప్రకటించిన చింతమనేని
మంత్రి పదవి టిడిపిలో చిచ్చు పెడుతోంది. బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, బోండా ఉమ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరు.
తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే, పార్టీ మారనని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. పార్టీ మారి కార్యకర్తలను అవమానించలేనని చెప్పారు.
రాజీనామా యోచనలో దూళిపాళ్ల
దూళిపాళ్ల నరేంద్ర రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆయన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అయిదుసార్లు గెలిచిన దూళిపాళ్లకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉండవద్దని దూళిపాళ్లకు చెబుతున్నారు.
ఫోన్ స్విచ్చాఫ్ చేసిన బండారు సత్యనారాయణ మూర్తి
కేబినెట్లో అవకాశం దక్కకపోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళతామన్నారు.