ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం:కడప స్టీల్ ప్లాంట్ తో సహా పలు కీలక నిర్ణయాలు
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాస్ మంత్రి వర్గ భేటీ లోని ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు.
ఎపికి కేంద్రం నెరవేర్చని హామీలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని...నెలలోపే ఒక మంచిరోజు చూసుకుని దీనికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆ హామీలు...మనమే నెరవేరుద్దాం
ఎపికి కేంద్రం హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే విషయంలో వివక్ష చూపుతుందని ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన హామీలను తానే అమలు పరచాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి వర్గ సహచరులతో ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ముందుగా కడప స్టీలు ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం-ప్రైవేటు సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ గా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
కడప స్టీల్ ప్లాంట్...స్థాపిద్దాం
మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సుమారు రూ. 18 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా...ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయమై ప్రధాని మోడీకీ చివరిసారిగా ఒక లేఖ రాయాలని, అలాగే విభజన హామీలను గుర్తు చేస్తూ మరో లేఖ కూడా రాద్దామని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తిత్లీ తుఫాన్ సాయం...కేంద్రం పై ఆగ్రహం
ఇక తిత్లీ తుపాను సాయం విషయంలో కేంద్రం తీరుపై మంత్రి వర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రూ.1200 కోట్ల సాయం అడగ్గా కేవలం 229 కోట్లు మాత్రమే ఇవ్వడంపై కేబినెట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తిత్లీ సాయం విషయమై కేంద్ర హోంమంత్రికి మరో లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ నీటి సరఫరా కోసం భారీగా అవసరమయ్యే నిధుల సమీకరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
పిపిపి మోడల్ తో... వైజాగ్ మెట్రో
విశాఖ పరిథిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం లభించింది. అలాగే రూ. 8,300 కోట్ల బడ్జెట్ తో విశాఖలో 42 కి.మీ పొడవైన మెట్రో రైలు ప్రాజెక్టుకు పిపిపి విధానంలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రపంచంలోనే పీపీపీ మోడల్లో నిర్మితమవుతున్న రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో కాగా...ఈ ప్రాజెక్ట్ కు 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది.2019 జనవరి 31 నాటికి గ్రామీణ ప్రాంతాలకు అన్న క్యాంటిన్లు విస్తరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 366 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని, అలాగే మున్సిపాలిటీలో మరో 215, గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా 152 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే వీటన్నింటినీ ఏక తాటి మీదకు తెచ్చేలా అన్నా క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.