ఏపీ కేబినెట్ నిర్ణయాలివే: కొత్త జిల్లాలకు ఓకే: ఏప్రిల్ 1: రూ.2 వేల కోట్ల లోన్: రెండు ఆర్జీయూకేటీ
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఊహించినట్టే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ అడుగు పడింది. పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి 2000 కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించుకోవడానికి ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చింది కేబినెట్.
కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ..
రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి, ఇందులో ఎదురయ్యే అంశాలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లాల పునర్విభజన అధ్యయన కమిటీగా దీన్ని పిలుస్తారు. ఈ రాష్ట్రం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది. జిల్లాల పునర్విభజనపై ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ నివేదికను అందజేయాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఈ కమిటీ.. తన నివేదిక, సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపడుతుంది. విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైన రాష్ట్రంలో.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి 25 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింని అంటున్నారు.
వైఎస్ఆర్ చేయూతపై
వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్ధిక సాయం అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాదిలో నాలుగు విడతల్లో ఈ పథకం కింద అర్హులైన మహిళలకు 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గ దర్శకాలపై మంత్రివర్గంలో చర్చించారు. నాడు-నేడు కింద ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖలో 28 పోస్టులను భర్తీ చేయడానికి అంగీకారం తెలిపింది. ఇందులో డెప్యుటేషన్ ప్రాతిపదికన 13 పోస్టులను భర్తీ చేస్తారు.
ఒంగోలు, శ్రీకాకుళంలల్లో ఆర్జీయూకేటీ
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు, శ్రీకాకుళంలల్లో కొత్తగా రాజీవ్గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి రెండే ఉన్నాయి. కడప జిల్లా ఇడుపుల పాయ, కృష్ణాజిల్లా నూజివీడులో ఉన్నాయి. వాటికి అదనంగా ఒంగోలులో కొత్త విద్యాసంస్థను నెలకొల్పడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాలో దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిర్మించడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. డిజైన్-బిల్ట్-ఫైనాన్స్ ప్రాతిపదికన పీపీపీ ద్వారా దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
Recommended Video
రాయలసీమ కరవును తీర్చడానికి
రాయలసీమలో నెలకొన్న కరవును శాశ్వతంగా రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఇది ఏర్పాటవుతుంది. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం అందించడంపై చర్చించింది కేబినెట్. కర్నూలు జిల్లా ప్యాపిలి లో 5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం, అదే మండలంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చించింది. గుంటూరు పోలీసు స్టేషన్లలో ముస్లింలు, సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేసిన ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఎత్తేయడానికి మంత్రివర్గం అంగీకరించింది.