రాజధాని అమరావతి: భువనేశ్వరితో కలిసి బాబు భూమిపూజ
అమరావతి: జూన్ 6 (శనివారం) ఉదయం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి భూమిపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 8.49 గంటలకు భూమి పూజ ప్రక్రియ మొదలు కానుంది.
తెల్లవారుజామున 3 గంటల నుంచే 19 మంది వేద పండితుల ఆధ్వర్యంలో హోమం జరగనుంది. ఉదయం 8 గంటలకే సీఎం చంద్రబాబు సతీసమేతంగా హాజరుకానున్నారు. తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని సర్వే నంబర్ 135, 136లో చంద్రబాబు దంపతులు భూమిపూజ చేయనున్నారు.
గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ అధికారులు ఈ భూమిపూజ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.
అన్నవరంలో భక్తులపై క్యాంటీన్ సిబ్బంది దాడి
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీసత్యనారాయణస్వామి దేవస్థానంలో భక్తులపై క్యాంటీన్ నిర్వాహకులు దాడి చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన 20 మంది భక్తులు అన్నవరం దేవుడిని దర్శించుకునేందుకు అక్కడికి చేరుకున్నారు.
దర్శన అనంతరం క్యాంటిన్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన భక్తులు భోజనం బాగోలేదని ప్రశ్నించడంతో క్యాంటీన్ సిబ్బంది వారిపై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తులపై కర్రతలో విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పబట్టారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లను ఆదేశించారు. అంతే కాదు క్యాంటిన్ను తక్షణమే మూసివేయాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు క్యాంటిన్ను మూసివేశారు.