big news:అమలులోకి మూడు రాజధానులు - జగన్ సర్కారు గెజిట్ నోట్ జారీ - త్వరలో శంకుస్థాపన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతం నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే సంబంధిత చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
Recommended Video
రాజధానిపై బీజేపీ గేమ్ప్లాన్: టార్గెట్ టీడీపీ -సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు - అమరావతేనన్న జీవీఎల్
న్యాయ శాఖ ద్వారా జారీ..
ఏపీ న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి పేరుతో శుక్రవారం రాత్రి జారీ అయిన ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా.. రాజధాని వికేంద్రీకరణ (మూడు రాజధానులు) వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. సమీకృత అభివృద్ధి చట్టం-2020ను అనుసరించి శాసనసభ అమరావతిలోను, సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాలు, రాజ్ భవన్ తదితర భవనాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలోనూ ఉంటాయని, అలాగే, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుందని, అక్కడ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతందని గెజిట్ లో పేర్కొన్నారు.
అమరావతి ఇకపై ఇలా..
సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదంతో ఇకపై ఆ ప్రాంతాన్ని ‘అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా'గా వ్యవహరించబోతున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి జారీ చేసిన గెజిట్ నోట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను జ్యూడీషియల్ క్యాపిటల్గా పిలుస్తారు. ఈ మూడు రీజియన్లను ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చట్టం - 2016 కింద నోటిఫికేషన్ జారీ చేసి ఏర్పాటు చేస్తారు.
త్వరలో శంకుస్థాపన..
ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన దరిమిలా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక అద్భుతమైన అవకాశమని, అమరావతితోపాటే విశాఖ, ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలూ ఎదుగుతాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలో సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స వెల్లడించారు. అమరావతిలో భూమి కోసం చేసినంత భారీ ఖర్చు విశాఖలో అవసరం ఉండదని వ్యాఖ్యానించారు.
రాజధాని కథ ముగియలేదు: జగన్కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథం
ఒక్కదానితో ఏడవలేక.. మూడా?
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిందికదాని వైసీపీ నేతలు పండుగ చేసుకోవద్దని, అతి త్వరలోనే ఏపీ హైకోర్టులో ఆ బిల్లులకు ఎదురు దెబ్బ తప్పదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. రాజధానుల వ్యవహారంపై శుక్రవారం స్పందించిన ఆయన.. జగన్ సర్కారుకు కీలకమైన ప్రశ్నలు సంధించారు. ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఈ గడువులో విశాఖపట్నానికి ఒక్క రూపాయి అదనంగా ఖర్చు చేశారా? ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డైనా వేశారా? సీమలో కనీసం చిన్న ప్రాజెక్టయినా పూర్తయిందా? ఒక్క రాజధానిని ఏడవలేని ఈ జగన్ ప్రభుత్వం.. మూడు రాజధానులు కడుతుందా? రూ.10 వేల కోట్లతో వడ్డించిన విస్తరి లాంటి అమరావతిని సద్వినియోగం చేసుకోలేని జగన్ నిజంగా తుగ్లకే''అని బోండా మండిపడ్డారు.