అమరావతే నవ్యాంధ్ర రాజధాని, టీడీపీది సింగిల్ లైన్ విధానం, ఉత్తరాంధ్ర నేతల ప్రకటనపై బోండా ఉమ
నవ్యాంధ్ర రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీది సింగిల్ లైన్ విధానమని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. అమరావతి రాజధాని అనే అంశానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ధాటించారు. రాజధానిపై ఇతర పార్టీల మాదిరిగా తమ వైఖరి మారబోదని తేల్చిచెప్పారు.
జగన్ ధ్వంస రచన చేస్తున్నారు: 'అమరావతే రాజధాని’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్
స్వాగతించిన విశాఖ ఎమ్మెల్యేలు..
విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనను అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతించడంతో ఈ మేరకు బోండా ఉమ తమ పార్టీ స్టాండ్ తెలియజేశారు. విశాఖ టీడీపీ నేతలు స్థానికత ఆధారంగా వెల్ కం చేశారని, టీడీపీ స్టాండ్ మాత్రం అమరావతి రాజధాని అని ఉమా స్పష్టంచేశారు. దీంతో రాజధాని అంశంపై టీడీపీలో భిన్న వాదనలు తీసుకొచ్చాయని పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతోంది.
బాబుకు కూడా చెప్పాం..
విశాఖపట్టణం కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతించారు. అమరావతి రైతులకు ఇబ్బంది కలుగకుండా విశాఖపట్టణంలో క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేయడాన్ని గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు సంబంధించి తమ అభిప్రాయాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడికి పంపించినట్టు పేర్కొన్నారు. సిటీ ప్రశాంతతకు భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అబ్బే అదేం లేదు..
ఉత్తరాంధ్రకు చెందిన మరికొందరు టీడీపీ నేతలు కూడా కార్యనిర్వహక రాజధాని ఏర్పాటును స్వాగతించారు. దీంతో రాజధానిపై టీడీపీ వైఖరి ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో బోండా ఉమ తెలుగుదేశం పార్టీ వైఖరిపై క్లారిటీ ఇచ్చారు. అమరావతే రాజధాని అని టీడీపీ కోరుకుంటుంది అని చెప్పారు.
తెరపైకి కొత్త వాదన
మరోవైపు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణంలో సెక్రటేరియట్ నిర్మిస్తున్నందున.. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ నిర్మించాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. అలా కాదని మొండిగా వెళితే రాయలసీమ ఐక్య వేదిక తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.