ఏపీ రాజధాని దొనకొండ అంటూ జోరుగా ప్రచారం ..భూముల ధరలు కొండెక్కాయిగా!!
Recommended Video
ఏపీ రాజధాని అమరావతి అంశం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని మారబోతుంది అని, త్వరలోనే ప్రకటన రాబోతుందని ప్రచారం జోరందుకుంది. ఏపీ రాజధాని దొనకొండకు మారుస్తున్న ట్లుగా ప్రచారం జరుగుతుండడంతో ఇక నేతల చూపులు దొనబండ సమీపంలోని భూములపై పడ్డాయి. దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు అటు పెద్ద నేతలే కాకుండా అయితే చోటామోటా నాయకులు కూడా ఎగబడుతున్నారు.
రాజధాని అమరావతి మార్చే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ? బొత్సా వ్యాఖ్యలతో మండిపడుతున్న టీడీపీ !!
బొత్సా వ్యాఖ్యలతో రాజధాని మారుతుంది అని ప్రచారం
కృష్ణా నది వరద కారణంగా ఏపీ రాజధాని అమరావతిలో కి నీళ్ళు వచ్చాయని, రాజధానిగా అమరావతి అనువైన ప్రాంతం కాదని, గతంలో శివరామ కృష్ణ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేసిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రాజధాని విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇక దీంతో ఏపీ రాజధాని మారబోతుంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఏకంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధానిగా ప్రకటిస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
దొనకొండ పేరు ప్రకటిస్తారని పుకార్లు .. దొనకొండలో భూముల ధరలకు రెక్కలు
దీంతో దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అటు రాజకీయ నేతలు, చోటామోటా లీడర్లు, రియల్టర్లు దొనకొండ పరిసర ప్రాంతాలలో భూముల కొనుగోలు పై ఆసక్తి చూపిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని మారుస్తారు అన్న ప్రచారం జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు దొనకొండ లో భూములను కొంటూనే ఉన్నారు. ఇక తాజా వ్యాఖ్యలతో ఇంకా పెద్ద ఎత్తున భూముల కొనుగోలు లావాదేవీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
దొనకొండ పరిసర గ్రామాల్లో భూముల ధరలు పెరగటంతో పండుగ వాతావరణం
ఏపీ రాజధానిగా దొనకొండ పేరే ఎందుకు ప్రచారం అవుతుంది అంటే రాయలసీమ ప్రజలకు అమరావతి కంటే దొనకొండ చాలా దగ్గర , అంతేకాకుండా అక్కడ వైసీపీ నేతలు ఇప్పటికే చాలా భూములను కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ రాజధానిని మార్చే ఆలోచన జగన్ చేస్తే అది ఖచ్చితంగా దొనకొండకే అన్నది నేతల అభిప్రాయం. ఇక ఈ నేపథ్యంలోనే దొనకొండ భూములు కొనుగోలు చేయడానికి నేతలు ఆసక్తి చూపిస్తున్నారు.
దొనకొండ లో ప్రస్తుత ఎకరం భూమి 15 నుండి 20 లక్షల వరకు ఉంటే ఒకవేళ రాజధాని దొనకొండ కు మార్చటం కన్ఫామ్ ఐతే కోట్లలో పలుకుతుందనే భావన కొనుగోలు దారుల్లో ఉంది. అందుకే ప్రస్తుతం దొనకొండ వద్ద భూములు కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారు చాలామంది నాయకులు. ఇక మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో దొనకొండ పరిసర ప్రాంత వాసులు పండుగ చేసుకుంటున్నారు. భూముల ధరలు పెరుగుతుండటంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన చెయ్యకున్నా భూములను కొనుగోలు చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.