రాజధానిపై చంద్రుడికి చుక్కలు, చస్తామని హెచ్చరిక
తుళ్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం జరుగుతున్న ల్యాండ్ పూలింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజధాని ప్రాంతంలో బలవంతంగా భూములు లాక్కుంటే చావే శరణ్యమని, తమకు పురుగుమందే దిక్కని ఆక్రోశిస్తూ కొందరు రైతులు సీఆర్డీఏ అదనపు కమిషనర్ కారును బుధవారం అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురుగల్లు గ్రామంలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం ఈ సంఘటన చోటుచేసుకుంది. సీఆర్డీఏ అదనపు కమిషనర్ చంద్రుడు ఆ గ్రామంలో మీదుగా వెళుతుండగా గమనించిన రైతులు కారును అడ్డుకున్నారు.
భూసమీకరణకు భూములు ఇవ్వలేమంటూ రైతులు ఆందోళనకు దిగారు. మరికొందరు రైతులు పురుగుమందు పట్టుకుని తాగి చచ్చిపోతామని కేకలు వేశారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న మంగళగిరి సీఐ కోటేశ్వరరావు అక్కడికి చేరుకుని రైతులను పంపించేశారు.
సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్ను అడ్డుకున్న గ్రామస్తులు తమ గ్రామాన్ని భూసమీకరణ నుండి మినహాయించాలని హెచ్చరించారు. వారు పురుగుల మందు డబ్బాలతో సహా రావడంతో ఒకింత ఉద్రిక్తత కనిపించింది. తమకు రాజధాని వద్దని, మా గ్రామాన్ని రాజధాని నిర్మాణం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.