విశాఖకు రాజధాని ఈసారీ కష్టమేనా ? పెండింగ్లో హైకోర్టు విచారణ- స్పందించని కేంద్రం
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టి ఏడాది దాటిపోయినా ఇప్పటికీ ముందడుగు పడటం లేదు. విశాఖకు రాజధాని తరలింపు ఇదిగో అదిగో అంటున్న జగన్ సర్కార్కు కోర్టులతో పాటు కేంద్రం నుంచి కూడా ఆశించిన సహకారం లభించకపోవడమే ఇందుకు కారణం. తమ చేతుల్లో ఉన్న కార్యనిర్వాహక, శాసన వ్యవస్ధలత సాయంతో రాజధాని తరలింపుకు అవసరమైన బిల్లులు నెగ్గించుకున్నా వాటికి న్యాయవ్యవస్ధలో అడ్డంకులు ఏర్పడటంతో ఈ ఏడాది కూడా రాజధాని తరలింపు అవకాశాలు లేనట్లే అన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మార్చి నెలాఖరు వరకూ సాగుతుందన్న అంచనాలు సర్కారుకు మంటపుట్టిస్తున్నాయి.
Recommended Video
ఈ ఏడాది రాజధాని తరలింపు లేనట్లే ?
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా గవర్నర్ ఆమోదం పొందిన రెండు కీలక బిల్లులకు హైకోర్టులో బ్రేక్ పడిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ప్రభుత్వం త్వరలో అని చెబుతున్నా ఉద్యోగులను ఆ మేరకు సన్నద్ధం చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర హైకోర్టు ఛీఫ్ జస్టిస్ బదిలీ కావడం, కొత్త సీజే వచ్చినా ఇంకా రాజధాని పెండింగ్ కేసుల విచారణ ప్రారంభం కాకపోవడంతో రాజధాని తరలింపుపై మరోసారి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్ధానిక సంస్దల ఎన్నికల ప్రక్రియ మార్చినెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉండటం రాజధాని తరలింపుపై ప్రభావం చూపబోతోంది. అటు కేంద్రం నుంచి కూడా సహకారం లేకపోవడం ఈ వేసవిలో రాజధాని తరలింపుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
హైకోర్టులో రాజధాని కేసుల విచారణ పెండింగ్
గవర్నర్ ఆమోదించి పంపిన సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేయడంతో మొదలైన విచారణ తాజాగా జరిగిన ఛీఫ్ జస్టిస్ బదిలీ వరకూ నిరాటంకంగా సాగింది. ఈ క్రమంలో తుది తీర్పు వచ్చేస్తుందని అంతా ఆశిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా సీజే బదిలీ అయ్యారు. కొత్త సీజే అరూప్ గోస్వామి తాజాగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోని హైకోర్టు ప్రధాన బెంచ్ రాజధాని పిటిషన్ల విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే దీనికి ముందే అసలు రాజధాని సమస్యకు మూలాలు, పిటిషన్ల నేపథ్యం వంటి వాటిని ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో ఈ కేసుల విచారణ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మొదలైనా ఏప్రిల్ లోపు పూర్తవుతుందా అంటే అనుమానమే.
స్ధానిక ఎన్నికలతో తరలింపు ఆలస్యం
ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం ఫిబ్రవరి చివరి వరకూ ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి ముగియగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అవి ముగిశాక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఇలా మార్చి నెలాఖరులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీ విరమణ చేసే వరకూ ఎన్నికల జాతర తప్పదు. వీటి మధ్యలో రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసేందుకు వీల్లేదు. ఎస్ఈసీ అనుమతితోనే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో అదీ సాధ్యమయ్యేలా లేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ రాజధాని తరలింపుపై ప్రభుత్వం చర్యలకు ఆటంకాలు తప్పకపోవచ్చు.
రాజధానుల తరలింపుపై కేంద్రం మౌనం
అమరావతి నుంచి విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించాలన్నా, కర్నూలుకు హైకోర్టు తరలించాలన్నా కేంద్ర ప్రభుత్వం రీ నోటిఫై చేయాల్సి ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా తిరిగి న్యాయస్ధానాలు ఇచ్చే తీర్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో న్యాయస్దానాలు కూడా ఇలాంటి కీలక అంశాలపై తీర్పులు ప్రకటించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ఎన్నికల సంఘం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. అందుకే కేంద్రం కూడా మౌనం వహిస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్రం... సీఎం జగన్ పదేపదే కోరుతున్నా హైకోర్టు తరలింపుపై రీ నోటిఫికేషన్కు కానీ, ఇతర చర్యల వేగవంతానికి సిద్ధం కావడం లేదు. దీంతో రాజధాని తరలింపుపై సర్కారు చెబుతున్న మాటలను నమ్మలేని పరిస్ధితి