విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని: మోదుగుల
హైదరాబాద్: విజయవాడు, గుంటూరు మధ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని తమ పార్టీ భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. దానివల్లనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే విషయంలో ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఇందులో కుట్ర లేదని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో వేదిక ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గురువారంనాడు తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వారితో చర్చలు జరిపారు.