హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారు
రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ నిర్ణయానికి అసెంబ్లీలో తీర్మానం తర్వాతే వైసీపీ సర్కారుకు గడ్డు కాలం మొదలైంది. అటుపై మండలి రద్దు, ఎన్నికల కమిషనర్ మార్పు, అమరావతి భూకుంభకోణంపై విచారణ, చంద్రబాబు గత నిర్ణయాలపై దర్యాప్తు.. తదితర వ్యవహారాల్లో జగన్ సర్కారుకు రాష్ట్ర హైకోర్టులో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే..
హైకోర్టులో అనుకూల తీర్పులు..
వివిధ అంశాలు, ప్రభుత్వ పరమైన నిర్ణయాలకు సంబంధించి మొన్నటి వరకు కోర్టుల్లో గొప్ప చిక్కులు ఎదుర్కొన్న జగన్ సర్కారుకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభిస్తోంది. పాత జడ్జిల స్థానంలో కొత్తవాళ్లు నియమితులైన దరిమిలా కీలక వివాదాలపై అనూహ్య తీర్పులు వెలువడుతున్నాయి. 'ఎస్ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్' అన్నట్లుగా ఏడాది కాలంగా సాగుతోన్న వివాదంలో హైకోర్టు తాజా తీర్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నిన్నటివరకు కోర్టు ఆదేశాలన్నీ నిమ్మగడ్డకు అనుకూలంగా రాగా.. గడిచిన వారం రోజుల నుంచి జగన్ సర్కారుకు ఊరటకలిగించే తీర్పులు, ఆదేశాలు వెలువడుతున్నాయి. ఇదే రకమైన పాజిటివ్ వాతావరణం రాబోయే రోజుల్లోనూ కచ్చితంగా కొనసాగుతుందని అధికార పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఆ క్రమంలోనే..
రాజధాని పంచాయితీకీ పరిష్కారం!
అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన గెజిట్ నోట్ పై వివాదాలు చెలరేగడం, ఇప్పుడా వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండటం తెలిసిందే. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించి చట్టాలుగా మారిన రాజధాని బిల్లులకు హైకోర్టు బ్రేకులు వేసింది. అయితే ఈ కేసులు విచారిస్తున్న ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి తాజాగా బదిలీ అయ్యారు. రాజధాని వ్యవహారాన్ని విచారించేందుకు కొత్త ఛీఫ్ జస్టిస్ గోస్వామి నేతృత్వంలో మరో బెంచ్ ఏర్పాటు కావాల్సి ఉంది. గతంలో పనిచేసిన జడ్జిలపై సీఎం జగన్ ఏకంగా సీజేఐ బోబ్డేకు ఫిర్యాదు లేఖ రాసిన దరిమిలా త్వరలో ఏర్పాటు కాబోయే బెంచ్.. మూడు రాజధానుల వ్యవహారాన్ని నిష్పక్షపాతంగా విచారించి, అనుకూల తీర్పు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే, పంచాయితీ ఎన్నికల వ్యవహారంలో ఎలాగైతే జగన్ అభీష్టానికి అనుకూలమైన తీర్పులొచ్చాయో, రాజధాని వివాదంలోనూ అదే జరుగుతుందని నేతలు చెబుతున్నారు. అంతేకాదు..
కోర్టు అనుమతితోనే విశాఖకు..
నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు కానుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోగా రాజధాని తరలింపు విషయంపై కోర్టుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పది రోజుల కిందట.. ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పారు. తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ.. ఏపీకి పరిపాలనా రాజధానిగా ఉండనుందని, చట్ట పరంగానే ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందని బొత్స అన్నారు.
రాజధాని తరలింపునకు ముహుర్తం
2019 నవంబర్ లో తొలిసారి ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం, గవర్నర్ సంతకం, గెజిట్ ప్రచురణ చకచకా జరిగిపోవడంతో గతేడాది(2020) ఉగాది (మార్చి 25) నాటికి పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని జగన్ సర్కారు భావించింది. కానీ అంతలోనే రాజధానిపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. జగన్ దూకుడుకు అడ్డుపడి, మూడు రాజధానుల గెజిట్ ను రద్దు చేసింది. మధ్యలో అనుకోని ఉపద్రవంలా కరోనా మహమ్మారి చెలరేగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండటం, అన్నిటికీ మించి హైకోర్టులో అనుకూల నిర్ణయాలు వస్తుండటంతో జగన్ తన కలల రాజధానికి వెళ్లేందుకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జల, బొత్స జోస్యం ప్రకారం ఏడాది ఉగాది (ఏప్రిల్ 13) నుంచి విశాఖ పరిపాలన రాజధానిగా ఉండే అవకాశాలున్నాయి. మరి వివాదాలపై కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో వేచి చూడాల్సిందే..
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -'హౌజ్ మోషన్' అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?