నేటి నుంచే: ఏపీలోని 10.6మిలియన్ల ఆవులకు ‘ఆధార్’ అనుసంధానం
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవులన్నింటికీ ప్రత్యేక ఆధార్ నెంబర్ రానుంది. నేటి (జూన్ 1) నుంచే ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని ఆవులకు ఆధార్ నెంబర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
అమరావతి: ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవులన్నింటికీ ప్రత్యేక ఆధార్ నెంబర్ రానుంది. నేటి (జూన్ 1) నుంచే ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని ఆవులకు ఆధార్ నెంబర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా అమరావతిలోని పశువుల ఆస్పత్రి నుంచి ప్రారంభం కానుంది.
రైతు లేదా ఆ పశువుల యజమాని ఆధార్ నెంబర్ను పశువులకు అనుసంధానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రత్యేక నెంబర్ ఇవ్వడం ద్వారా రైతులు తమ పశువులకు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స అందించడం సులభంగా మారుతుంది. అంతేగాక, అధికారులకు కూడా పశువుల కదలికలు తెలుస్తుంటాయి.
కాగా, ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆవులకు ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పశువులకు కేటాయించే ప్రత్యేక నెంబర్ ద్వారా దాని లింగం, వయస్సు, ఏ జాతికి చెందినది అలాంటి వివరాలు తెలుస్తాయి.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 10.6మిలియన్ల పశువులున్నట్లు సమాచారం. వాటిలో పుంగనూరు జాతి, ఒంగోలు జాతి పశువులు ప్రత్యేకమైనవి. ప్రత్యేక ఆధార్ సంఖ్యలను కేటాయించి ఈ జాతిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సెంట్రల్ డేటా బ్యాంక్ను కూడా కొనసాగించాలని నిర్ణయించుకుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్లో గతంలోనే గోవధను నిషేధించడం జరిగింది. 1977 ప్రొహిబిషన్ చట్టం ద్వారా గోవధ నిషేధం, పాడి ఆవు, లేదా ఒక దూడ, మగ, ఆడ ఆవులను చంపడంపై నిషేధం విధించడం జరిగింది.