నేరాలు ఎక్కువే: ఖైదీలతో నిండిన సెంట్రల్ జైళ్లు..అరకొరగా సిబ్బంది,ఎన్సీఆర్బీ లెక్కలివి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ జైళ్లు హౌజ్ ఫుల్గా ఉన్నాయి. వాటి కెపాసిటీకి మించి అందులో ఖైదీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన సెంట్రల్ జైళ్లు ఉండగా వాటి నిర్వహణకు సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. నాలుగు సెంట్రల్ జైళ్లు ఒకటి విశాఖపట్నం, మరొకటి రాజమండ్రి, ఇంకోటి నెల్లూరు, నాల్గవది కడపలో ఉన్నాయి.
వంద శాతం దాటిన ఆక్యుపెన్సీ రేట్
విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లలో మొత్తం 3814 మంది నేరస్తులు మాత్రమే ఉండేందుకు వీలుంది. అయితే ప్రస్తుతం ఈ నాలుగు జైళ్లలో పరిధికి మించి నేరస్తులు ఉన్నారు. మొత్తం 4,212 మంది నేరస్తులు ఈ జైళ్లలో ఉన్నారు. ఇందులో మొత్తం 163 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. 2018లో ఆక్యుపెన్సీ రేట్ ఏకంగా 110.4శాతంగా ఉన్నిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరించింది. 2017లో ఈ నాలుగు జైళ్లల్లో కలిపి 4,690 మంది నేరస్తులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2016లో 4,126 మంది నేరస్తులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
విచారణ ఎదుర్కొంటున్న వారే ఎక్కువ
అయితే శిక్షపడిన నేరస్తులకంటే విచారణ ఎదుర్కొంటున్న వారితోనే జైళ్లు రద్దీగా మారాయని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. విచారణ ఎదుర్కొంటున్న వారు దాదాపు 60శాతం మంది కేంద్ర కారాగారాల్లో ఉన్నట్లు వైజాగ్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ చెబుతున్నారు. అంతేకాదు సదుపాయాలు కూడా సరిగ్గా లేవని చెప్పారు. ఇక జైళ్లను నిర్వహించేందుకు లేదా మెయిన్టెయిన్ చేసేందుకు సిబ్బంది దాదాపు 24శాతం తక్కువగా ఉందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లెక్కలు
ఇక సెంట్రల్ జైళ్లు, సబ్ జైళ్లు, జిల్లా జెళ్లు, మహిళా జైళ్లు, ఓపెన్ జైళ్లు ఇలా మొత్తం 105 ఉండగా వీటిల్లో ఆక్యుపెన్సీ రేటు 79.5శాతంగా ఉన్నట్లు 2018 గణాంకాలు చెబుతున్నాయి. ఈ జైళ్లలో 8786 మంది నేరస్తులు ఉండేందుకు సదుపాయం ఉండగా 2018లో 6,988 మంది ఖైదీలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 414 మంది మహిళా ఖైదీలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
బెయిల్ దొరక్క చాలామంది జైళ్లలోనే...
ఇక నేరాలు నిరూపించబడి శిక్ష ఖరారైన ఖైదీలు 2373 మంది సెంట్రల్ జైళ్లు ఇతర జైళ్లలో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1574 మంది హత్య చేసి జైలుకు రాగా, అత్యాచార కేసుల్లో 163 మంది శిక్ష పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి జైళ్లలో ఉంటున్నవారు, విచారణ పేరుతో జైళ్లలో మగ్గుతున్నవారికి వివిధ కారణాలతో బెయిల్ మంజూరు కావడం లేదని సీనియర్ అడ్వకేట్ కే మురళీధర్ చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి వ్యాపారం, సైబర్ క్రైమ్లకు యువత దిగుతోందని చెప్పారు. జైళ్లు రద్దీగా ఉండటంతో కొత్త జైళ్లను నిర్మించాలని ఆయన అన్నారు.