ఏపీలో కరోనా: తెచ్చింది చంద్రబాబే అంటారేమో.. జగన్పై టీడీపీ చీఫ్ ఫైర్..
కరోనా మహమ్మరి గురించి తేలికగా మాట్లాడటమే కాకుండా, తప్పుడు విధానాలతో సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికే ప్రతిపక్షంపైనా, ప్రశ్నించిన అందరిపైనా దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ ముఖ్య నేతలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఆయా జిల్లాల్లో కరోనా ప్రభావం, రైతుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే నీటి పంపకాల అంశంలో జగన్ నాటకాలాడుతున్నారని, ఒకప్పుడు కాళేశ్వరాన్ని విమర్శించిన ఇదే జగన్... కేసీఆర్ తో కుమ్మక్కై ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా వెళ్లాడని, ఇప్పుడు కూడా కేసీఆర్ తో కలిసే కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. పేదల అసైన్డ్ భూములను ఇష్టారాజ్యంగా లాక్కున్నారని, ఇళ్ల పట్టాల ముసుగులో భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Recommended Video
''జగన్ కు చట్టాలు, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదు. తాత రాజారెడ్డి తరహాలోనే ఫ్యాక్షన్ కల్చర్ ఫాలో అవుతున్నాడు. అడ్డొచ్చిన అందరినీ బెదిరించడం, ప్రశ్నించినవాళ్లపై తప్పుడు ప్రచారాలు చేయించడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. చివరికి మీడియాపైనా కక్షసాధింపులకు దిగుతున్నారు. ప్రతిదానికీ పాత ప్రభుత్వమే కారణమంటున్నారే తప్ప వీళ్లు ఒరగబెట్టిందేమీ లేదు. వైసీపీ నేతల తీరు చూస్తుంటే.. రాష్ట్రానికి కరోనా వైరస్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు, టీడీపీనే అంటారేమోననే అనుమానం కలుగుతోంది..''అని చంద్రబాబు చురకలంటించారు.