ఎపి:పీఆర్సీ జీవోలో మార్పులు: ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జీవో జారీ చేసింది.
ఈ నెల 18న ఇచ్చిన జీవోలో అమరావతి జెఎసి నేతలు ఇచ్చిన విజ్ఞప్తులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. వారి ప్రతిపాదనల ఆధారంగా 11వ పీఆర్సీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈనెల 18న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. అయితే దీనిపై ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మండిపడడంతో ఈ పొరపాట్లను సరిదిద్దుతూ ప్రభుత్వం మరోసారి 11వ పీఆర్సీ జీవో ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల మధ్య 11 వ పీఆర్సీ జీవో చిచ్చు రగిలించిన సంగతి తెలిసిందే. అమరావతి జేఏసీ ప్రతిపాదనల ఆధారంగా 11వ పీఆర్సీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈనెల 18న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఆ జీవోలో ఎపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ పేరు లేకుండా అమరావతి జేఏసీ పేరు మాత్రమే పేర్కొనడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో చివరికి ఈ వ్యవహారం అశోక్బాబు వర్సెస్ బొప్పరాజులకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అశోక్బాబు నేతృత్వంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సతీష్ చంద్రను కలిశారు. ఈ క్రమంలో తాజా ఉత్తర్వులో ఆయా ఉద్యోగ సంఘాల పేర్లన్నీ పేర్కొనడంతో వివాదం సమసిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘం అన్ని అంశాలను పరిశీలించి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.