ఎపి:ఐఎఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు చేర్పులు...
అమరావతి:రాష్ట్రంలో 20 రోజుల క్రితం భారీగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో స్వల్ప మార్పులు చేర్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు.
తాజా మార్పుల ప్రకారం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ నుంచి సీసీఎల్ఏ కార్యదర్శిగా బదిలీపై వెళ్లిన జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ మళ్లి తిరిగి తన పాత పోస్టయిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగానే కొనసాగనున్నారు. ఇక ఎస్సీ కార్పోరేషన్ ఎండీగా నియమితులైన వివేక్ యాదవ్ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ గా నియమితులైన ఎన్. ప్రభాకర్ రెడ్డిని...సర్వే, సెటిల్ మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా నియమించారు. ఏపిఐఐసి వైస్ చైర్మన్,ఎండిగా ఉన్న ఎ.బాబును ఏపి స్టేట్ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా ఏ.ఎస్.దినేష్ కుమార్ ను నియమించారు. జైళ్ల శాఖలో డిఐజిగా ఉన్న డాక్టర్ ఎం వరప్రసాద్ ను సీడప్ ఎండీగా నియమించారు. రాష్ట్రంలో మూడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న ఐఎఎస్ అధికారులను మే 6 వ తేదీన బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా తాజాగా ఆ బదిలీల్లో ఇలా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.