టిటిడి వివాదం:శ్రీవారి నగలు మాయం: చెన్నారెడ్డి, ఆభరణాలున్నాయి: ఈవో
Recommended Video
అమరావతి: టిటిడి ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రభుత్వవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
టిటిడిలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిటిడి ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్, టిటిడి ఈవో లతో అమరావతిలో మంగళవారం నాడు సమావేశమయ్యారు.
రమణ దీక్షితులు ఇటీవల కాలంలో టిటిడి పాలకవర్గంపై అనేక ఆరోపణలు చేశారు. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకే కుదిస్తూ టిటిడి నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంపై కూడ రమణదీక్షితులు విమర్శలు గుప్పించారు.
మొత్తంగా టిటిడిలో పరిణామాలపై రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలు టిటిడి పాలకవర్గంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. ఈ తరుణంలో టిటిడిపై చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అమరావతిలో టిటిడిపై సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై రమణదీక్షితులు ఎలా విమర్శలు గుప్పిస్తారని ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రమణదీక్షితులు వ్యవహరంపై ప్రశ్నించారని సమాచారం. మరోవైపు అర్చకుల వివాదం, టిటిడి ఆభరణాలపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై బాబు చర్చించారు.
మరోవైపు టిటిడి ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతున్న సమయంలోనే పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి టిటిడి ఆభరణాలు కొన్ని కన్పించకుండా పోయాయని ఆరోపించారు.
మే 21వ తేదిన టిటిడి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు పింక్ డైమండ్ తో పాటు టిటిడిలో చోటు చేసుకొంటున్న విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
2011లోనే శ్రీవారి నగలు మాయం
మరోవైపు టిటిడి ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతున్న సమయంలోనే పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి టిటిడి ఆభరణాలు కొన్ని కన్పించకుండా పోయాయని ఆరోపించారు. 2011లో తాము ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. శ్రీకృష్ణ దేవరాలయాల కాలం నుండి శాసనంలో ఉన్న ఆభరణాలు ,ఇతర వస్తువులు లేవని ఆయన చెప్పారు.అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు టిటిడి ఆభరణాలను భద్రపర్చేందుకు కమిటీని ఏర్పాటు చేసి జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై కూడ చెన్నారెడ్డి స్పందించారు.రమణ దీక్షితులకు ఏదో జరిగిందనే ఉద్దేశ్యంతో ఇప్పడు మాట్లాడుతున్నారని చెన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంత కాలం పాటు ఆయన ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.
శ్రీవారి నగలన్నీ సురక్షితం
టిటిడిలో శ్రీవారి నగలన్నీ సురక్షితంగానే ఉన్నాయని ఈవో సింఘాల్ తెలిపారు. ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టిటిడి నిధులు ఎక్కడ కూడ దుర్వినియోగం కాలేదని ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయడు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన చెప్పారు.
అన్ని విషయాలపై చట్టపరమైన చర్యలు
అన్ని విషయాలపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామని ఈవో చెప్పారు. ఆగమశాస్త్ర ప్రకారంగానే పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. బూందీపోటు వద్ద ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. ఆగమశాస్త్రం ఒప్పుకొంటే శ్రీవారి నగలను ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు. శ్రీవారి నగల జాబితాను ఇచ్చామన్నారు. నగలను ప్రదర్శించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.ప్రతి ఏడాది శ్రీవారి నగల తనిఖీ జరుగుతోందని సింఘాల్ గుర్తు చేశారు.
శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన నగలను కమిటీ తేల్చలేదు
టిటిడిలో ఉన్న నగల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని టిటిడి ఈవో సింఘాల్ చెప్పారు. 1952 నుండి కూడ స్వామివారికి ఉన్న నగల జాబితాకు సంబంధించిన రికార్డులున్నాయని ఆయన చెప్పారు. 2011లో రిటైర్డ్ జడ్జిల కమిటీ ప్రకారంగా నగలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ నగలు ఇచ్చారనే విషయాన్ని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చలేదన్నారు.