తెలుగు వాడిగా రికార్డు: ఎమ్మెస్కేకు చంద్రబాబు అభినందనలు
అమరావతి: సౌత్జోన్ తరుపున టీమిండియా సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సెలక్షన్ కమిటీలో రోజర్ బిన్నీని తొలగించి అతని స్థానంలో సౌత్జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ను నియమించిన సంగతి తెలిసిందే.
ఈ విషయం తెలిసిన వెంటనే రాయలసీమ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎమ్మెస్కే ప్రసాద్కు మిండియా సెలెక్షన్ కమిటీలో చోటు దక్కడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న తెలుగు వాడిగా రికార్డులకెక్కిన ఎమ్మెస్కే యువ క్రీడాకారులందరికీ ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు.
దీంతో పాటు విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఏసీఏ-వీడీసీఏ స్టేడియానికి టెస్టు హోదాను ఇస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. శశాంక్ మనోహార్ అధ్యక్షతన సోమవారం జరిగిన 86వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్లకు ఉద్వాసన పలికుతూ వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరులో జన్మించిన ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్గా ఎంపికైన తొలి క్రికెటర్గా ప్రసాద్ గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆపరేషన్స్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. భారత్ తరుపున 6 టెస్టులు, 17 వన్డేలు ఆడాడు.