వచ్చే ఎన్నికల్లో లోకేష్ కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ...ఖాయం చేసుకోవచ్చు!
Recommended Video
అమరావతి:వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారని తొలుత వార్తలు రాగా, ఆ తరువాత కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే లోకేష్ కుప్పం నుంచే పోటీ చేస్తారని భావించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారసుడు లోకేష్ పోటీకి వివిధ నియోజకవర్గాల పేర్లను పరిశీలించిన అనంతరం...వీటన్నింటికంటే సేఫ్ అండ్ సెంటిమెంటల్ ప్లేస్ కుప్పం నియోజకవర్గం మాత్రమేనని సిఎం చంద్రబాబు నిర్ణయించారట. కుమారుడి కోసం తానే సీటు త్యాగం చేయడం సమంజసమనే భావన కూడా చంద్రబాబులో ఉందంటున్నారు.
ఎన్నికల్లో పోటీ...లోకేష్ వ్యాఖ్యలు
మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తానని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. అలాగే ముందస్తు ఎన్నికలపైనా ఆయన స్పందించారు. ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే...ముందే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు.
కుప్పం నుంచే...ఎందుకంటే?
నారా లోకేష్ ఇటీవలే కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులు సుడిగాలి పర్యటన జరిపారు. అయితే ఆయన హఠాత్తుగా ఈ పర్యటన జరపడం వెనుక పక్కా వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దేశంలో ముందస్తు ఎన్నికలపై వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో దీని గురించి ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ముందస్తుకు వెళ్లే యోజన లేకున్నా ఏదైనా జరగవచ్చనే భావనతో లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీకి అనువుగా సన్నాహక చర్యలు ఈ విధంగా చేపట్టారని వారు అభిప్రాయపడుతున్నారు.
కృష్ణా జిల్లా...ఎందుకు కాదు?
కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తారనంటూ కొంతకాలం క్రితం వార్తలు వెలువడ్డాయి. అయితే అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి లోకేష్ అవకాశం కల్పించాల్సి ఉండటం, అది వేరే సంకేతాలను ఇచ్చే అవకాశాలు ఉండటం, సామాజిక వర్గాల గణనను పరిగణనలోకి తీసుకొని ఎంత సేఫ్ ప్లేస్ చూసినా అది వివిధ కారణాల రీత్యా రిస్క్ జోన్ లోనే ఉండటం తదిదర కారణాలతో రాష్ట్రంలో అన్నింటికంటే లోకేష్ కు కుప్పం నియోజకవర్గమే బెస్ట్ అని సిఎం చంద్రబాబు నిర్ణయించారట.
మరి చంద్రబాబు...ఎక్కడ నుంచి?
పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా సిఎం చంద్రబాబు ఎక్కడనుంచైనా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉండటం, కొడుకు లోకేష్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేను సీటు నుంచి తప్పించడం కాకుండా చంద్రబాబు కోసం సీటు అడిగితే సదరు ఎమ్మెల్యేలు సంతోషంగా అంగీకరించే వాస్తవ పరిస్థితులు, కుప్పం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండటం, టిడిపి అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబునాయుడు ఈ నియోజకవర్గం నుంచి ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తూ ఉండటం...ఆ విధంగా ఇప్పటికి ఆరు సార్లు అక్కడ చంద్రబాబు గెలవడంతో ఇక అంతకంటే సేఫెస్ట్ ప్లేస్ మరి ఇంకొకటి లోకేష్ కు లేదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు లోకేష్ కు కుప్పం ఫైనల్ చేశారట. అందుకోసమే లోకేష్ ఇటీవలి సుడిగాలి పర్యటన అదే విషయాన్ని ఖాయం చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.