బోట్ ప్రమాదం: నది నుండి లాంచీ వెలికితీత, లాంచీలోనే మృతదేహలు, బాబు సందర్శన
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీని సహయకబృందాలు బుధవారం మధ్యాహ్నం వెలికి తీశారు. లాంచీలోనే చిక్కుకుపోయిన మృతదేహలను వెలికితీస్తున్నారు. సంఘటనస్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. బాధితులను ఓదార్చారు.
మంగళవారం సాయంత్రం గోదావరి నదిలో మంటూరు వద్ద లాంచీ మునిగిపోయింది. ఈ ఘటనలో సుమారు 36 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. భారీ క్రేన్ల సహాయంతో లాంచీని గోదావరి నదిలో సుమారు 60 అడుగుల లోతులో మునిగిపోయిన లాంచీని వెలికి తీశారు. లాంచీ నుండి ఇప్పటికే నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.
లాంచీని నది నుండి బయటకు తీసిన కొద్దిసేపటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో లాంచీ నుండి సుమారు 16 మంది సురక్షితంగా బయటపడ్డారు.
సంఘటన స్థలాన్ని చంద్రబాబునాయుడు పరిశీలించారు. ఘటన జరిగిన తీరును చంద్రబాబునాయుడు అధికారులను అడిగి తెలుసుకొన్నారు. రెస్క్యూ టీమ్ చేస్తున్న సహాయక చర్యలను బాబు తెలుసుకొన్నారు. ఇద్దరు కవల పిల్లల మృతదేహలను లాంచీనుండి వెలికి తీశారు.