నాకేమైనా జరిగితే రక్షణగా ఉండండి, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు: బిజెపిపై బాబు సంచలనం
ద్వారపూడి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. తనకు ఏదైనా జరిగితే తనకు రక్షణ వలయంగా ఉండాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు.
కేంద్రం నుండి టిడిపి వైదొలిగిన తర్వాత టిడిపి, బిజెపి మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఈ తరుణంలో చంద్రబాబునాయుడు మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.
Recommended Video
బ్యాంకులను ముంచితే కేంద్రం ఏం చేస్తోందని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శలు చేశారు.
నాకేమైనా అయితే రక్షణ నిలబడండి
తనకు ఏమైనా జరిగితే తనకు రక్షణగా నిలబడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కేంద్రం ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాను కేంద్రంపై పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు.
ప్రాంతీయ తత్వం రెచ్చగొడుతోంది
బిజెపి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, హమీలను అమలు చేయాలని తాను డిమాండ్ చేస్తే రాయలసీమ డిక్లరేషన్ అంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.
25 ఎంపీలు గెలిపిస్తే ప్రధానిని నిర్ణయిస్తాం
25 ఎంపీలను గెలిపిస్తే ప్రధానిని తామే నిర్ణయించనున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 మంది ఎంపీ స్థానాల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించాలన్నారు. ఏపీకి ఏం కావాలంటే అదే దక్కించుకోవాలంటే 25 మంది ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తనకు సహకరించాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు.
బ్యాంకులను దోచుకొన్నా కేంద్రం నిర్లక్ష్యం
బ్యాంకులను దోచుకొన్నా కేంద్రం ఏం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బ్యాంకులను దోచుకొన్న వారంతా విదేశాల్లో దర్జాగా కాలక్షేపం చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల సొమ్మును దోచుకొని విదేశాల్లో వారంతా ఉన్నారని బాబు చెప్పారు. వారి విషయంలో కేంద్రం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదనేదే తమ పార్టీ అభిప్రాయమన్నారు.