రేషన్ బియ్యం పంపిణీపై వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం!
అమరావతి: రాష్ట్రంలో చౌక ధరల డిపోల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను లబ్దిదారుల ఇంటి వద్దకే చేర్చాలని ఆయన నిర్ణయించారు. బియ్యాన్ని పాకెట్ల రూపంలో తీసుకెళ్లి, లబ్దిదారులకు వారి ఇంటి వద్దే అందజేసేలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడి సచివాలయంలో సోమవారం ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. తుది నిర్ణయాన్ని తీసుకున్నారు.
రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా..
చౌక ధరల డిపోల ద్వారా తెల్లరంగు రేషన్కార్డు గల పేద కుటుంబాలకు చేరాల్సిన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పక్కదారి పట్టాయని, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే వార్తలు తరచూ చూస్తుంటాం. రేషన్ బియ్యాన్ని అమ్ముకుని కోట్ల రూపాయలను ఆర్జించిన వారూ లేకపోలేదు. ఇలాంటి అక్రమాలన్నింటినీ అరికట్టే దిశగా వైఎస్ జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బియ్యాన్ని పాకెట్లుగా మార్చడం ద్వారా, ఆ పాకెట్లపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రను వేయడం వంటి చర్యల వల్ల అవినీతిని అరికట్టడానికి ఆస్కారం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పాకెట్లుగా మార్చిన బియ్యాన్ని తస్కరించడానికి ఏ మాత్రం వీలు ఉండదని అభిప్రాయపడింది.
సెప్టెంబర్ నుంచి అమలు..
ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని 50 కేజీల బస్తాల్లో రేషన్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తోన్న విషయం తెలిసిందే. లారీల ద్వారా 50 కేజీల గోనె సంచుల్లో బియ్యాన్ని చౌక ధరల డిపోనకు చేర్చుతారు. అనంతరం- వాటిని లూజ్గా లబ్దిదారులకు అందజేస్తారు. ఫలితంగా- అక్రమాలకు అవకాశం ఏర్పడింది. దాన్ని నిరోధించడానికి- ఇకపై కొత్తగా 5, 10, 20 కేజీల ప్యాకెట్లలో బియ్యాన్ని పంపిణీ చేస్తారు. రేషన్ సరుకులన్నింటినీ ప్యాకెట్లుగా తయారు చేసి, లబ్దిదారుల ఇళ్ల వద్దకు చేర్చే ప్రక్రియను సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.
పర్యవేక్షణ బాధ్యత గ్రామ వలంటీర్లకు..
ఈ కొత్త తరహా డోర్ డెలివరీ విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ వలంటీర్లకు అప్పగించనుంది. ఇలాంటి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారుల ఇళ్ల వద్దకు చేర్చడానికే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమిస్తామని వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ వలంటీర్లు సైతం అవినీతికి పాల్పడకుండా ఉండటానికి వారికి ప్రతినెలా 5000 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఒక్కో వలంటీర్కు 50 ఇళ్లను కేటాయిస్తారు. ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని చేర్చడం గ్రామ వలంటీర్ల ప్రధాన విధి. ఫలితంగా- ఒక్క రేషన్ బియ్యం మాత్రమే కాకుండా.. పింఛన్లను కూడా ఇదే విధంగా అర్హులకు చేర్చుతారు.
చౌక డిపోల్లో తూకాలకు ఛాన్స్ లేనట్టే..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల చౌక ధరల డిపోల్లో ఇకపై తక్కెడలు గానీ, తూకాల మిషన్లు గానీ కనిపించవు. ప్రభుత్వమే- పౌర సరఫరాల సంస్థకు చెందిన గిడ్డంగుల్లో బియ్యాన్ని తూకం వేసి, వాటిని ప్యాకెట్లుగా మార్చి, లారీల ద్వారా డీలర్ల వద్దకు చేర్చుతుంది. అక్కడి నుంచి యథావిధిగా తెల్లరంగు రేషన్కార్డు గల కుటుంబాలకు ఆ ప్యాకెట్లను ఇంటి వద్దకే చేర్చుతారు. ఫలితంగా ఇక మధ్యలో ఎక్కడే గానీ బియ్యం లేదా, ఇతర నిత్యావసర సరుకులను తూకం వేయడానికి అవకాశమే ఉండదు.
బియ్య అందిన వెంటనే ఎస్ఎంఎస్..
లబ్దిదారులకు బియ్య పాకెట్లను అందించిన వెంటనే- డీలర్ సహా తహశీల్దారు వరకు అందరి ఫోన్లకు ఎస్ఎంఎస్లు అందే విధానాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం. ఎస్ఎంఎస్ అందిన వెంటనే- సంబంధిత అధికారలు గానీ డీలర్లు గానీ.. లబ్దిదారులకు ఫోన్ చేసి, విచారించే వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. దీనివల్ల ఎవరు కూడా అవినీతికి పాల్పడటానికి అవకాశం ఉండదని చెబుతున్నారు. పౌర సరఫరాల కార్యకలాపాలన్నింటినీ పారదర్శకంగా చేపట్టడానికి ఇదో ముందడుగుగా భావిస్తున్నారు.