రేపు శ్రీశైలానికి వైఎస్ జగన్: రిజర్వాయర్ ఇన్ఫ్లో: రాయలసీమ ఎత్తిపోతలపై
శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పొంగిపొర్లుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి మన రాష్ట్రంలోని ప్రకాశం బ్యారేజీ దాకా నిర్మించి ఆనకట్టలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో పోటెత్తుతున్నాయి. వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఎత్తేశారు అధికారులు. వేల కొద్దీ క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి విడుదలైన కృష్ణా జలాలు పులిచింతల, నాగార్జున సాగర్లకు చేరుతున్నాయి. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంటున్నాయి.
Recommended Video
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీశైలాన్ని సందర్శించబోతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన వెంట జల వనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల లోక్సభ సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం, నంద్యాల ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్రా రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి రానున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడే జల వనరుల శాఖ అధికారులతో సమావేశమౌతారు. పోతిరెడ్డి పాడు విస్తరణలో భాగంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభ పనులను సమీక్షిస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మాన్యుఫాక్చరర్స్ లిమిటెడ్ ఈ పనులను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి అవసరమైన వర్క్ ఆర్డర్ను కూడా జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు. ఈ ప్రక్రియను వైఎస్ జగన్ మరోసారి సమీక్షిస్తారు. బిడ్డింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాల గురించి వైఎస్ జగన్ ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన వివాదాలు ప్రస్తుతం అపెక్స్ కమిటీ వద్ద ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించడానికి రాబోతోండటం చర్చనీయాంశమైంది.