Padayatra: ఇచ్ఛాపురంలో జగన్ పాదయాత్ర ముగిసిన రోజే..చిత్తూరులో అమ్మఒడికి శ్రీకారం..!
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, నవ్యాంధ్రలోగానీ పాదయాత్రలకు కేరాఫ్గా నిలిచిన కుటుంబం వైఎస్ది. ఇదివరకు ప్రతిపక్ష నేతగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టారు. ఆ తరువాత ఆయన కుమార్తె వైఎస్ షర్మిళ అదే బాటలో నడిచారు. రాష్ట్ర విభజన తరువాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో వైఎస్ పాదయాత్ర తరువాతే అధికారాన్ని అందుకున్నారు. ఈ సారి ఆ అవకాశాన్ని ఆయన కుమారుడు అందిపుచ్చుకున్నారు.
నేనున్నాను..నేను విన్నాను..
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు జనవరి 9 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. `నేను ఉన్నాను.. నేను విన్నాను`. ఇదీ జగన్ పాదయాత్ర నినాదం. మరో ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో జనం మధ్యలోకి వచ్చారు. ఏకంగా 3,648 కిలో మీటర్ల మేర సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద 2017 నవంబరు 6న ప్రజా సంకల్ప పాదయాత్ర 421 రోజుల పాటు కొనసాగింది.
ఇదే రోజు ఇచ్ఛాపురంలో..
గత ఏడాది ఇదే రోజున వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా శ్రీకాకుళం జిల్లాలో తన పాదయాత్రను ముగించిన విషయం తెలిసిందే. నవంబరు 25వ తేదీన ఆయన పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని కడకెల్ల వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలో మొత్తం 37 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 10 నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ జిల్లాలో జగన్ 338 కిలోమీటర్ల మేర నడిచారు. గత ఏడాది జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలో చివరిరోజు పాదయాత్ర కొనసాగింది. అదే జిల్లాలోని ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించారు.
పాదయాత్ర హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా..
గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిందీ పాదయాత్ర. నవరత్నాలను రూపొందించడానికీ ప్రధాన కారణమైంది. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ గుర్తించిన అంశాలనే నవరత్నాలు మలిచారు. వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆ మేనిఫెస్టో ప్రకారంగా పరిపాలనను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్.
ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చే దిశగా..
పాదయాత్రలో ఇచ్చిన హామీలు గానీ, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను గానీ అమలు చేయటమే లక్ష్యంగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 80-90 శాతం అమలు చేశామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. గ్రామ సచివాలయాలు, దశల వారీ మద్యపాన నిషేధం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రివర్స్ టెండరింగ్ వంటి అంశాలన్నీ మేనిఫెస్టోలో పొందుపరిచినవే.
ఇక అమ్మఒడికి శ్రీకారం..
వైఎస్ఆర్సీపీ నవరత్నాల్లో కీలకమైనది అమ్మఒడి. పాదయాత్ర ముగింపు రోజే.. దీనికి శ్రీకారం చుట్టబోతున్నారాయన. పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం.. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి రూ. 15 వేలు అమ్మ ఒడి పథకం కింద ఇస్తానని హామీ ఇచ్చారు. .. పాదయాత్రకు ఏడాదైన సందర్భంగా చిత్తూరులో జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి చిత్తూరులో శ్రీకారం చుడుతున్నారు. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ద్వారా భరోసా ఇస్తున్నారు.