సొంత జిల్లాకు జగన్..రెండు రోజులు అక్కడే: వైఎస్ జయంతి సహా: బిజీ షెడ్యూల్: ట్రిపుల్ ఐటీకి
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో పర్యటించబోతున్నారు. రెండురోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జగన్ తన కుటుంబ సమేతంగా కడప జిల్లాకు బయలుదేరి రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ విడుదల చేశారు.
విశాఖలో రాజధాని ఏర్పాటు దిశగా కీలక అడుగు: తరలివెళ్లేది సచివాలయం ఒక్కటే కాదు: డీజీపీ టూర్
మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. సాయంత్రం కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు జగన్ను కలుసుకుంటారు.
రాత్రికి ఇడుపులపాయ అతిథిగృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు ఇడుపులపాయలోని రాజీవ్గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)ని సందర్శిస్తారు. కొత్తగా నిర్మించిన భవన సముదాయాలను ప్రారంభిస్తారు.
Recommended Video
వ్యవసాయ అవసరాల కోసం కొత్తగా నిర్మించదలిచిన సౌర విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు వైఎస్ జగన్. ఈ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యం మూడు మెగావాట్లు. ఈ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ఇడుపుల పాయ అతిథిగృహంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. జిల్లాలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిను సమీక్షిస్తారు. అదేరోజు మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.