ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారా?: హోదా ఇప్పట్లో రాదు: బాంబు పేల్చిన జగన్: ఎన్నికల తరువాతే
అమరావతి: విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పడిన రాష్ట్రానికి ప్రాణవాయువును అందించే అంశంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తోన్న ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చాలాకాలం తరువాత ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల పాటు నిరంతరాయంగా పోరాటం కొనసాగించిన ఆయన ఈ అంశంపై తన వైఖరిని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రత్యేక హోదా ఇప్పట్లో రాదనే విషయాన్ని ఆయన నిర్మొహమాటంగా తేల్చేశారు.
Recommended Video
పరిశ్రమల ఏర్పాటుపై మేధోమథనం సందర్భంగా..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుసగా వివిధ అంశాలు, ప్రాజెక్టుల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి గల అవకాశాలు, ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులు, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత ఇచ్చారు.
కేంద్రానికి పూర్తి మెజారిటీ రావటం వల్లే..
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ రావటం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించుకోలేకపోతున్నామని జగన్ స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాల కంటే మెజారిటీ సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కాయని, దాని ప్రభావం ప్రత్యేక హోదాపై పడిందని అన్నారు. ఎన్డీఏ కూటమికి ఆశించిన స్థాయిలో మెజారిటీ స్థానాలు దక్కకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి తమ మీద ఆధారపడాల్సిన వచ్చి ఉండేదని, అలా జరిగి ఉంటే ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టి, బేరసారాలు కొనసాగించి ఉండేవాళ్లమని అన్నారు.
ప్రత్యేక హోదా దూరం
ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని రావడం వల్ల కేంద్రంపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోతున్నామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఈ పరిణామాల మధ్య ప్రత్యేక హోదా అనేది దూరమైనట్టేనని తాను భావిస్తున్నానని అన్నారు. అయినప్పటికీ.. తాను నిరాశ చెందట్లేదని, కేంద్రంతో నిరంతరంగా ఈ విషయంలో సంప్రదింపులను కొనసాగిస్తున్నామని చెప్పారు. దీనికోసం పార్టీ నాయకులకు బాధ్యతలను అప్పగించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆధారపడే రోజు వస్తుంది..
బీజేపీ కాకపోయినా.. ఏ పార్టీ అయినా సరే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే వాళ్లకు తమ మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. దురదృష్టవశావత్తూ అలాక్కూడా జరగలేదని అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీని సాధించుకుందని అన్నారు. ఫలితంగా- వైఎస్ఆర్సీపీ మీద ఆధారపడే అవసరం బీజేపీకి రాలేదని అన్నారు. ఈ విషయాన్ని ఎత్తకుండా ఉంటే, అడగడం మానేస్తే బీజేపీ గానీ, ఎన్డీఏ కూటమి గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ మరిచిపోతుందని, అందుకే తాము సంప్రదింపులను కొనసాగిస్తున్నామని అన్నారు.
ఆ రోజు తప్పకుండా వస్తుంది..
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే ఏ పార్టీకైనా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అవసరం తప్పకుండా వస్తుందని జగన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు కాకపోయినా, రేపైనా కేంద్ర ప్రభుత్వం తమ మీద ఆధారపడే రోజులు వస్తాయని జగన్ అన్నారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తామని అన్నారు. తమ రాష్ట్రానికి హోదా ఇస్తేనే.. సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామనే షరతు పెడామని జగన్ చెప్పారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు.
అయిదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా..
ఈ సందర్భంగా వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీపై పరోక్షంగా ఘాటు విమర్శలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తకుండా విమర్శనాస్త్రాలను సంధించారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ముందుకు సాగాయని గుర్తు చేశారు. అయిదేళ్ల పాటు సఖ్యతగా కలిసి కాపురం చేశాయని అన్నారు. అప్పట్లో ప్రత్యేక హోదాను సాధించడానికి మంచి అవకాశం ఉండిందని అన్నారు. అలాంటి అవకాశాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కలిసి కాపురం చేసే పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదాను సాధించలేకపోయిందని చురకలు అంటించారు.