సీయస్ నెక్స్ట్ టార్గెట్ అదేనా : టిడిపి నేతలు ఇరుక్కుంటారా : ఎల్వీకి ఆ అధికారం లేదు..!
ఏపిలో ఎన్నికల వార్ ముగిసినా..ఇప్పుడు సీయం వర్సెస్ సీయస్ అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. టిటిడికి బంగారం రవాణా పైన ఆరోపణలు రాగానే..విచారణకు అదేశించిన సీయస్..ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీయస్కు తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఆయన టిడిపి పైన ప్రయోగించే అస్త్రంగా మారనున్నాయి. ఇసుక బకాసురులతో పాటుగా..కృష్ణా నదిలో అక్రమణల పైన సీయస్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీయం నివాసం కూడా ఉండటంతో..ఆయన అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి.
సీయస్ ఎన్జీటీ ఆదేశాలు..
ఢిల్లీలో ఎన్జీటీ విచారణకు ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం హాజరయ్యారు. ఏపిలో తీసుకోవాల్సిన చర్యల పైన జస్టిస్ గోయల్ ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ప్రదానంగా కృష్ణా నదిలో ఇసుక త్రవ్వకాలు..అక్రమ నిర్మాణాల పైన చర్చ సాగింది. గతంలో ఏపి ప్రభుత్వానికి వంద కోట్ల జరిమానా సైతం విధించారు. ఇప్పుడు..వాతావరణ కాలుష్యం పెను ముప్పుగా మారుతుందని, నివారణ చర్యలు తీవ్రతరం చేయాలని సీఎస్కు ఎన్జీటీ సూచించింది. అన్ని విభాగాలలో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టామని సీఎస్ విచారణలో తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ కట్టడాలతో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతోందని ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. అమరావతిలో కృష్ణానది పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది.
ఇసుకాసురులే లక్ష్యంగా
ఏపిలో వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి టిడిపి నేతలు సొమ్ము చేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే ఈ ఆరోపణల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినా..ఇసుక దోపిడీ ఆగలేదు. దీని పైనా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నా పట్టించుకోవటం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక, ఇప్పుడు ఎన్జీటి నేరుగా సీయస్ను వీటిపైన దృష్టి పెట్టాలని ఆదేశించటంతో ఆయన వ్యవహార శైలి గమనించిన వారు ఎల్వీ సుబ్రమణ్యం ఖచ్చితంగా ఇసుక అక్రమార్కులపైన ఖచ్చితంగా కఠిన చర్యల దిశగా చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉన్నా..టిడిపి వారి సంఖ్యే ఎక్కువగా ఉండటంతో..ఎల్వీ ఇప్పుడు ఎటువంటి విచారణకు ఆదేశిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
ఎల్వీ పై కొనసాగుతున్న మాటల దాడి..
ఇక, మరో వైపు టిడిపి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పైన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎల్వీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయాలు అమలు చేయడం తప్ప... అడ్డుపడే అధికారం లేదని స్సష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్షాన నిలబడ్డారని సీఎస్ తన పరిధి దాటి ప్రవర్తిస్తే మే 23న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు లేవని సీఎస్ మాట్లాడడం సరికదన్నారు. సీఎస్ రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని పుల్లారావు తీవ్రంగా స్పందించారు.