జగన్ సర్కార్పై సోషల్ మీడియా పోస్టులు- గుంటూరు బామ్మపై సీఐడీ కేసు నమోదు... నెల రోజుల్లో రెండో కేసు..
కుల రాజకీయాలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా సానుభూతిపరులుగా ఉంటున్న కొందరు ప్రత్యర్దులపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లడం సర్వసాధారణంగా మారుతోంది. అయితే ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకోవడంతో సీఐడీ ఐటీ చట్టం కింద వరుసగా కేసులు నమోదు చేస్తోంది. తాజాగా విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం విఫలమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
కేసీఆర్..కేంద్రం మధ్యలో జగన్ : కళ్లు మండేదెవరికి...: ఏపీ సీఎం అసలు టార్గెట్ అదే..!
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంటూరు లక్ష్మీపురానికి చెందిన పూదోట రంగనాయకమ్మ అనే వృద్ధురాలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆమె పెట్టిన పోస్టులు వైరల్ కావడంతో అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆమెపై కేసు cr no 24/2020, U/S 505(2), 153 (A), 188, 120(B), rw 34 IPC, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి... 41ఏ నోటీసులను అందజేశారు. ఈ కేసులో నేరం రుజువైతే మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.వృద్ధురాలిపై సోషల్ పోస్టుల కేసు నమోదుపై నగరవాసులు విస్మయం చెందుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోస్టింగ్స్ పెట్టిన ఆరోపణలపైనే విజయవాడ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ పైనా సీఐడీ కేసులు గత నెలలో కేసు నమోదు చేశారు. ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు. నెల రోజుల వ్యవధిలో విశాఖకు చెందిన 60 ఏళ్ల రంగనాయకమ్మ ఇదే తరహాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్స్ పెట్టడంపై అధికారులు సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడే మిగతా వారికి కూడా హెచ్చరికలు జారీ చేసేందుకే ఈ కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు.