ముందు జగన్, వెనుక హైకోర్టు... అడకత్తెరలో పోక చెక్కలా ఏపీ సీఐడీ పరిస్దితి...
ఏపీలో ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీంకోర్టులో వరుసగా తగిలిన ఎదురుదెబ్బలు ఇప్పుడు సీఐడీకి తలనొప్పిగా మారిపోతున్నాయి. కోర్టు తీర్పులపై సోషల్ మీడియాలో కొందరు వైసీపీ సానుభూతి పరులు పెట్టిన పోస్టులపై న్యాయస్ధానాల ఆదేశంతో కేసులు నమోదు చేసిన సీఐడీ.. వాటి విషయంలో ముందుకెళ్లాలా వద్దా అనే విషయంలో మలగుల్లాలు పడుతోంది. ముందుకెళితే ప్రభుత్వానికి కోపం.. వెళ్లకపోతే హైకోర్టుకు కోపం అన్నట్లుగా ఈ వ్యవహారం మారిపోవడంతో ఛార్జిషీట్ దాఖలు కూడా ఆలస్యమవుతోంది. త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని హైకోర్టుకు నిన్న హామీ ఇచ్చిన సీఐడీ తదుపరి చర్యలపై దృష్టిపెట్టింది.
పెరుగుతున్న సోషల్ ప్రభావం...
ఏపీలో గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా ప్రభావం విచ్చలవిడిగా పెరుగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వాలకు, ప్రభుత్వాధినేతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారు ఎక్కువయ్యారు. వీరికి అడ్డుకట్ట వేయడంలో చట్టాలకు కోరలు లేకపోవడంతో ఈ తంతు అలాగే కొనసాగింది. అయితే తాజాగా ఈ పోస్టుల వ్యవహారం కోర్టు తీర్పులకూ పాకింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్ధానాల్లో వెలువడుతున్న వ్యతిరేక తీర్పులతో ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న కొందరు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వీటిపై మరో పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు ఏకంగా బాధ్యలైన వంద మందిపై కేసులు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది.
జగన్ వ్యతిరేక వ్యాఖ్యలపైనా...
వాస్తవానికి అప్పటికే సీఎం జగన్ కూ, వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ సానుభూతి పరులు పోస్టులు పెట్టారు. వీటిపై ప్రభుత్వం సీరియస్ కావడంతో రంగంలోకి దిగిన సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటి విచారణ కూడా వివిధ దశల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూడా సోషల్ పోస్టులు బయటికి రావడంతో ఒకేసారి ఈ రెండు వ్యవహారాలపై సీఐడీ దర్యాప్తు చేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. అయితే ఈ రెండింటిలో ప్రభుత్వం కంటే కోర్టు తీర్పులపై జరుగుతున్న ప్రచారం తీవ్రమైన అంశం కాబట్టి దీనిపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్దితి. ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల కంటే కోర్టు తీర్పులపై వ్యతిరేక పోస్టులపై ముందుగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్ధితి. కానీ ఇందులో నిందితులంతా అధికార వైసీపీ ప్రభుత్వ సానుభూతి పరులే. దీంతో ఏం చేయాలో తెలియక సీఐడీ మల్లగుల్లాలు పడుతోంది.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి...
కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతి పరులపై కేసులు నమోదు చేసిన సీఐడీ అంతకు మించి ముందుకెళ్లలేకపోతోంది. వీరిని విచారణకు పిలిపించిందీ లేదు. వీరిని ప్రశ్నించాలంటే ప్రభుత్వానికి కోపం వస్తుందేమోనన్న భయం. అలాగని వేచి చూస్తుంటే నిన్న హైకోర్టు అక్షింతలు వేసింది. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ ప్రచారం జరుగుతున్నా స్పందించరా అని ప్రశ్నించింది. ఇప్పటివరకూ ఈ కేసులో ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. దీంతో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ కేసులో పూర్తి స్ధాయి దర్యాప్తు చేసి పోస్టులు పెట్టిన వారి పాత్ర లేదని చెప్పే పరిస్ధితి లేదు. అలాగని వీరిని నిందితులుగా చేరుస్తూ ఛార్జిషీట్ ఫైల్ చేస్తే ప్రభుత్వ ఆగ్రహం చవి చూడక తప్పదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.