లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డను ఫిక్స్ చేస్తున్నారా ? హైదరాబాద్ లో సీఐడీ... త్వరలో ప్రశ్నించే అవకాశం..
కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖ వ్యవహారంలో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన రాశారని చెబుతున్న లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఇఫ్పటివరకూ ఏపీలోనే విచారణ జరిపిన సీఐడీ.. తాజాగా హైదరాబాద్ కు మకాం మార్చడం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఆయన పీఎస్ ను విచారిస్తున్న అధికారులు.. త్వరలో నిమ్మగడ్డ వాదన కూడా రికార్డు చేసే అవకాశముంది.
Recommended Video
నిమ్మగడ్డ కేసు విచారణ- హైదరాబాద్ కు...
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ విషయంలో ఏపీ సీఐడీ జరుపుతున్న దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ లేఖకు సంబంధించిన వ్యవహారంపై ఏపీలోనే విచారణ జరిపిన సీఐడీ పోలీసులు తాజాగా హైదరాబాద్ కు మకాం మార్చడంతో కేసులో మరిన్ని ఆధారాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నిమ్మగడ్డకు పీఎస్ గా వ్యవహరించిన సాంబమూర్తిని ఇప్పటికే ఓసారి విజయవాడలో ప్రశ్నించిన సీఐడీ.. తాజగా హైదరాబాద్ కు తీసుకెళ్లి మరీ ప్రశ్నిస్తుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.
ఇప్పటికే నిర్దారణకు- కానీ ఆధారాల కోసం..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాశారని చెప్పిన లేఖ ఆయన రాయలేదని, బయటి నుంచి మెయిల్ ద్వారా ఆయనకు చేరిందని సీఐడీ గుర్తించింది. అలాగే ఆ లేఖ కేంద్రానికి పంపిన తర్వాత ఆధారాల ధ్వంసం చేయడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయనేది సీఐడీ ప్రధాన అనుమానం. కేంద్రానికి రాసిన లేఖ బయటి నుంచి ఎవరు పంపారో తెలుసుకునేందుకు ఐపీ అడ్రస్ ల ట్రేసింగ్ కొనసాగుతోంది. అయితే ఇదే అంశంపై ఆయన పీఎస్ సాంబమూర్తి నోటితోనే ఈ విషయాలు చెప్పిస్తే తగిన ఆధారంగా ఉంటుందనే భావనలో సీఐడీ ఉన్నట్లు అర్ధమవుతోంది.
రమేష్ కుమార్ నూ ప్రశ్నించే అవకాశం...
ఇప్పటికే స్ధానిక ఎన్నికల వాయిదాతో పాటు కరోనా వైరస్ ప్రభావంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు. ఎన్నికల వాయిదా తర్వాత కొంతకాలం హైదరాబాద్ నివాసం నుంచే విధులు నిర్వర్తించించిన రమేష్.. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తొలగించడంతో సొంత ఇంట్లోనే ఉంటున్నారు. అయితే కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డ వాదన కూడా తెలుసుకునేందుకు త్వరలో నోటీసులు జారీ చేసి నిమ్మగడ్డను ప్రశ్నించాలని సీఐడీ భావిస్తోంది. నిమ్మగడ్డ వాదన కూడా తీసుకున్న తర్వాత కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.