నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్
రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ మెడకు ఉచ్చు బిగిస్తూ సీఐడీ కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్లో భాగంగా బాబు, లోకేశ్ల సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలంటూ డాక్యుమెంట్ నెంబర్లతో సహా సీఐడీ హైకోర్టు ముందుంచింది. ఎన్నారైలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను సమర్పించింది. ఈ వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ తీర్పును రిజర్వు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ సందర్భంగా ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి..
చంద్రబాబును షేక్ చేసిన జగన్ -రోజా స్టన్నింగ్ కామెంట్స్ -ఏపీ సీఎంను అంబేద్కర్తో పోల్చిన ఉషశ్రీ
బాబు, లోకేశ్ సన్నిహితులే..
రాజధాని అమరావతిలో జరిగింది భూకుంభకోణమేనంటూ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, నాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి పిటిషనర్లు భూముల కొనుగోలులో అనైతికంగా లబ్ధిపొందినట్లు సీఐడీ ప్రాథమిక దర్యాప్తులోనే బయటపడిందని, అమెరికా నుంచి కూడా నిధులు వచ్చాయని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించేందుకు ఆదేలివ్వాలని ఏజీ కోరారు. లోకేశ్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేశ్.. నారా కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫిన్లీజ్లో పనిచేశారని, రాజేశ్ భార్య శ్రీహాస, మరొకరు కంతేరులో 2.64 ఎకరాలు కొన్నారని, తాళ్లం మణికొండ అనంత సాయి విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్న గాయత్రీ రియల్టర్స్ సంస్థ అమరావతిలో 23.60 ఎకరాలను కొనుగోలు చేసిందని, వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం.. నంబూరు, కంతేరు, కాజ గ్రామాల్లో 12.23 ఎకరాలు కొనుగోలు చేసిందని, గుడ్ లైఫ్ ఎస్టేట్స్ యాజమాన్యం కూడా నవులూరు, బేతపూడి, ఆత్మకూరు గ్రామాల్లో 10.23 ఎకరాలను కొనుగోలు చేసిందని ఆరోపించిన సీఐడీ.. వీరంతా బాబు, లోకేశ్ ల స్నిహితులేనని పేర్కొంది. అలాగే..
మసాలాల
రారాజు
-మనం
రోజూ
చూసే
ఎండీహెచ్
అధినేత
ఇకలేరు
-చదివింది
5..
జీతం
రూ.21కోట్లు
టీడీపీ హయాంలో భారీగా లబ్ది..
చంద్రబాబు హయాంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అత్యధిక నిధులు పొందిన లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి డాక్టర్ పీవీ రాఘవ.. వెలగపూడి, తాడికొండ, తక్కెళ్లపాడు గ్రామాల్లో రాజధాని ప్రకటనటకు ముందే 26.62 ఎకరాలను కొనుగోలు చేశారని, నార్త్ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు చినకాకాని, కంచికచర్ల, బలుసుపాడు, లింగాపురం, నవులూరు, బేతంపూడి, మందడం, ధరణికోట, ఉంగుటూరు తదితర గ్రామాల్లో 17.80 ఎకరాలను కొన్నారని చెప్పిన ఏజీ.. సదరు ప్రాంతంలో కోర్ క్యాపిటల్ వస్తుందని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రకటిస్తారని తెలియకపోవడం వల్లే భూములు విక్రయించినట్లు అమ్మకందారులు సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. సీబీఐ నిందితులుగా పేర్కొంటోన్న వారంతా వేర్వేరుగా పిటిషన్లు వేసి తమ వాదనను కోర్టు ముందుంచారిలా..
2014 నుంచే అమరావతిపై ఫోకస్..
కిలారు రాజేష్ తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. రాజధాని అమరావతి మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, క్యాపిటల్ సిటీ రీజియన్ 217 చ.కి.మీ.లో ఉందని గుర్తుచేస్తూ.. తన క్లయింట్ రాజేశ్ క్యాపిటల్ సిటీ రీజియన్కి బయటే భూములు కొనుగోలు చేశారని, అయినా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడమే తప్పనడం సరికాదన్నారు. రాజధాని అమరావతిలోనే రాబోతున్నట్లు 2014 నుంచే మీడియాలో వార్తలు వచ్చాయని, వాటి ఆధారంగానే భూములు కొన్నారని లూథ్రా తెలిపారు.
స్వచ్ఛందంగా అమ్మితేనే కొన్నాం..
అమరావతిలో భూకొనుగోళ్లలో నేరపూరిత కుట్ర ఉందనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేవని, నిజానికి భూయజమానులు స్వచ్ఛందంగా అమ్మకానికి పెడితేనే కొనుగోళ్లు జరిగాయి తప్ప ఇందులో ఎలాంటి బలవంతాలు జరగలేదని పిటిషన్ల తరఫు లాయర్లు స్పష్టం చేశారు. ఒక్కసారి యజమానులు భూములు అమ్మిన తర్వాత.. వాటికి ధరలు పెరిగితే.. మమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేశారంటూ కేసులు పెట్టడం దారుణమని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాలకు, సివిల్ కోర్టులకు విలువ ఏముంటుంది? కాబట్టి పిటిషనర్లపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయండంటూ లూథ్రా వాదించారు. చివరిగా..
భూకొనుగోళ్లతో ప్రభుత్వానికి నష్టమేంటి?
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏజీ శ్రీరాం వాదిస్తున్న సమయంలో జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ స్పందిస్తూ.. ప్రైవేటు భూకొనుగోళ్ల లావాదేవీలను నేరపరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అసలు ఈ భూముల కొనుగోళ్ల వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టం ఏముంది? అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ..నేరపూరిత కుట్ర ఉండడం వల్లనే సీఐడీ కేసు నమోదు నమోదైందని, అందుబాటులో ఉన్న సమాచారం మేరకే ఎఫ్ఐఆర్ దాఖలైందని పేర్కొన్నారు. వాదనలు మగియడంతో రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి.. ఆయా భూముల కొనుగోళ్ల పత్రాలను హైకోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించారు.