పాత్రధారులు దొరికారు..సూత్రధారులను తేల్చాలి: రాజధాని ల్యాండ్ స్కామ్లో స్పీడుగా సీఐడీ
అమరావతి: ఏపీ రాష్ట్రం మూడు రాజధానుల అంశంతో అట్టుడికిపోతున్న వేళ మరో అంశం సీఐడీ వెలుగులోకి తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలు వ్యవహారంలో భారీగా అవకతకవకలు జరిగినట్లు సీఐడీ గుర్తించింది. కఠిక పేదరికంలో ఉన్న వారి పేర్లతో కొన్ని కోట్లు విలువ చేసే భూములను గుర్తించామని సీఐడీ పేర్కొంది. అంతేకాదు ఈ భూములన్నీ రాజధాని ప్రాంతంలోనే ఉన్నట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది.
రాజధాని భూములపై సీఐడీ విచారణ
రాజధాని భూముల వ్యవహారంలో గత చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని చెబుతూ దీనిపై విచారణ చేయిస్తామని ప్రస్తుత వైసీపీ సర్కార్ చెప్పింది. చెప్పినట్లుగానే సీఐడీ దర్యాప్తు వేసింది. దర్యాప్తు చేసిన సీఐడీ పలు ఆసక్తికర అంశాలు కనుగొంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వ్యక్తులు, తెల్ల రేషన్ కార్డులున్న వ్యక్తులు 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు గుర్తించామని సీఐడీ పేర్కొంది. దీని విలువ రూ.200 కోట్లు ఉంటుందని వెల్లడించింది.
తెల్ల రేషన్ కార్డులున్న వారు భూమి కొనుగోలు
ఈ భూములను 2014-15లో కొనుగోలు చేసినట్లు వివరించింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు నెలకు రూ.5000 సంపాదన కలిగి వారు 797 మంది 700 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ చెప్పారు. ఇక భూమి కొనుగోలు వ్యవహారంలో భారీగా డబ్బులు మారాయని కొనుగోలు చేసిన వారిలో చాలామందికి పాన్ కార్డులు కూడా లేవని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ మొత్తం 2014 మరియు 2015లో జరిగిందని ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు.
ఈడీ, ఐటీ సహకారం కోరిన సీఐడీ
ఇక భూముల కొనుగోలు వ్యవహారంలో విచారణ చేయాల్సిందిగా ఈడీ, మరియు ఐటీ శాఖలను కోరినట్లు సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ చెప్పారు. పన్నుకూడా ఎగవేసి మనీలాండరింగ్కు కూడా పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని ఏడీజీ సునీల్ కుమార్ చెప్పారు. ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన ఇద్దరు మంత్రులు ఒక దళిత మహిళ నుంచి బలవంతంగా భూమిని కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసును నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.