రేపటి నుంచి ఏపీలో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్ల నో- సగం టికెట్లతో కష్టమని ప్రకటన..
ఏపీలో కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్లను తిరిగి తెరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం.
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు, మల్లీప్లెక్స్ లను ఈ నెల 15 నుంచి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే సగం సీట్లతోనే షోలు వేయాలని ఆంక్షలు పెట్టింది. దీంతో పాటు ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం పునరాలోచించాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ప్రస్తుతం థియేటర్లు తెరవాలంటే కనీసం ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయల చొప్పిన ఖర్చవుతుందని, సగం ఆక్యుపెన్సీతో వీటిని తిరిగి ప్రారంభించడం, కొనసాగించడం కష్టమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన థియేటర్ల పునఃప్రారంభం వాయిదా పడినట్లే.
ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తేయడంతో పాటు ఇతర మినహాయింపులు ఇస్తే థియేటర్లు ప్రారంభిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నిర్ధిష్ట హామీ లభించే పరిస్ధితి లేదు. కరోనా కారణంగా ప్రైవేటు సంస్ధలతో పాటు ప్రభుత్వాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో థియేటర్లకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చే పరిస్ధితి లేదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో వీరిద్దరి మధ్య ప్రతిష్టంభన కారణంగా థియేటర్లు తెరిచే పరిస్ధితి కనిపించడం లేదు.