రూటు మార్చిన వైఎస్ జగన్: ఎమ్మెల్యేలు, ఎంపీలతో వరుస భేటీ: అసంతృప్తులపై: సోషల్ మీడియాతోనూ
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ ఏడాది కాలం పాటు పాలనపైన, మేనిఫెస్టో అమలుపైనా దృష్టి కేంద్రీకరించిన ఆయన.. ఇక పార్టీ వ్యవహారాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. పార్టీలో కీలక బాధ్యతలను వహిస్తోన్న ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలతో వరుస భేటీలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో వరుస భేటీల అనంతరం పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతోనూ జగన్ భేటీ అవుతారని అంటున్నారు.
జగన్ సర్కార్పై నిమ్మగడ్డ ఎదురుదాడి? ఆ విషయంలో హైకోర్టులో పిటీషన్? అడ్వొకేట్ జనరల్పై
హామీల అమలుపై
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ వ్యవహారాల కోసం సమయాన్ని కేటాయించిన సందర్భాలు చాలా తక్కువే. ఈ బాధ్యతలన్నింటినీ ఆయన తనకు నమ్మకస్తులైన నాయకులపై వదిలిపెట్టారు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ అధినేత వీ విజయసాయి రెడ్డి, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి నేతలే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ ఏడాది కాలం పాటు వైఎస్ జగన్ పాలనపైనే ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం మేర హామీలను నెరవేర్చామని చెప్పుకోగలుగుతున్నారు.
పార్టీలో అసంతృప గళంపై
కొద్దిరోజులుగా వైఎస్ఆర్సీపీలో అసంతృప్తుల గళం బాగా వినిపిస్తోంది. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, దాడిశెట్టి రాజా ఇదివరకే అధికారుల పనితీరును అడ్డుగా పెట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక లోక్సభ సభ్యుడు రాఘురామ కృష్ణంరాజు వ్యవహార శైలి గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుని చెలరేగిపోతున్నారాయన. ఫిర్యాదుల వరకూ వెళ్లింది పరిస్థితి.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే..
పార్టీ అధికార పగ్గాలను అందుకున్న ఈ ఏడాది కాలంలోనే ఇంత పెద్దఎత్తున అసంతృప్తులు తయారు కావడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి అసంతృప్త పరిస్థితులను మొగ్గలోనే తుడిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే- ఇక పార్టీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే- ఇక పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేతో సమావేశం కాబోతున్నారని అంటున్నారు.
రోజూ 10 మందితో..
రోజూ 10 మంది చొప్పున ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ అవుతారని అంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని, దీనికి అవసరమైన చర్యలను తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు దీనికి సంబంధించిన సమాచారం వెళ్లిందని తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజల మనోభావాలపై వైఎస్ జగన్ ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే- అసమ్మతి ఏర్పడటానికి గల కారణాలను కూడా ఆరా తీస్తారని అంటున్నారు.
సోషల్ మీడియా విభాగంతోనూ
ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం పార్లమెంటరీ పార్టీ సభ్యులతోనూ వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి- రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై వైఎస్ జగన్ అసహనంతో ఉన్నారని అంటున్నారు. అనంతరం సోషల్ మీడియా విభాగం నాయకులు, కార్యకర్తలతోనూ జగన్ సమావేశమౌతారని, ముఖాముఖి వారితో చర్చిస్తారని సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై వారికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.