బాబు మాటలకు అర్థాలే వేరులే: అప్పుడలా, నంద్యాల ఉప ఎన్నికపై ఇప్పుడిలా...
చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో రెండు రోజుల పాటు పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయన వ్యవహార శైలిని గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని తెచ్చాయి.
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం - టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో రెండు రోజుల పాటు పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయన వ్యవహార శైలిని గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని తెచ్చాయి. త్వరలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక గురించి దేశమంతా చర్చించుకోవాలని సంచలన వ్యాఖ్య చేశారు.
ఒకనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా భూమా నాగిరెడ్డి 1996 నుంచి 2004 వరకు నంద్యాల ఎంపీగా ప్రాతినిధ్యం వహించినా, ఆయన మామ ఎస్వీ సుబ్బారెడ్డి, భార్య శోభానాగిరెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేసినా మంత్రి పదవులు ఇవ్వకుండా దాటవేసిన ఘనత చంద్రబాబుది. ఈ పరిస్థితుల్లోనే భూమా నాగిరెడ్డి కుటుంబం క్రమంగా ప్రజారాజ్యం.. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానికి చేరిపోయింది.
కానీ విధి వక్రించి 2014 ఎన్నికలు ముగిసే వేళ శోభానాగిరెడ్డి.. ఇటీవల భూమా నాగిరెడ్డి దుర్మరణం పాలయ్యారు. భూమా నాగిరెడ్డి స్థానే త్వరలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ కూడా తేల్చేశారు. గతంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్లక్ష్యానికి బదులు చెప్పుకునేందుకే భూమా అఖిలప్రియకు తన క్యాబినెట్లో చోటు కల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. అందువల్లే భూమా నాగిరెడ్డి స్థానే జరిగే ఉప ఎన్నికను చంద్రబాబు ఒక సవాల్గా తీసుకున్నారు.
విపక్ష, అధికార పక్ష ఎమ్మెల్యేల విస్మయం ఇలా
మూడేళ్ల పాటు నిర్లక్షంగా వ్యవహరిస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సకల వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. పలు అభివ్రుద్ధి పథకాలు చేపట్టారు. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఖరుకు మంత్రులు సైతం నంద్యాలలో చేపట్టిన అభివ్రుద్ధి కార్యక్రమాలపై ఆశ్చర్య చకితులయ్యారు. అరచేతిలో వైకుంఠం చూపేలా చేపట్టిన అభివ్రుద్ధి పనుల గురించి విస్మయం పాలయ్యారు. తమ ఎమ్మెల్యే చనిపోతే బాగుండునని మిగతా నియోజకవర్గాల ప్రజలు భావిస్తున్నారని సంచలన ప్రకటనలు చేశారు.
Recommended Video
2000లో విద్యుత్ చార్జీల పెంపు
దానికి పరాకాష్టగానే ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం అర్దరాత్రి వరకు నంద్యాల నియోజకవర్గ మహిళా నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు, ప్రత్యేకించి మహిళా సభ్యులతో గడుపుతూ చేసిన వ్యాఖ్యలకు..గతంలో 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) పాలక మండలికి జరిగిన ఎన్నికల్లో నాటి సీఎంగా చేసిన వ్యాఖ్యలకు సారూప్యత కనిపిస్తోంది. 2000లో విద్యుత్ చార్జీల పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యావత్ ఆంధ్రావని ఉద్యమిస్తూ భాగ్య నగర వీధుల్లో ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ముందుకు వచ్చింది. నాడు విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో సగం జిల్లాల్లో టీడీపీ ఓటమి పాలైంది.
2002 జనవరిలో ఎంసీహెచ్ ఎన్నికల్లో బాబు ఇలా
ఆ తర్వాత 2001 ఏప్రిల్లో కరీంనగర్ నగరంలో ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన తర్వాత 2002 జనవరిలో హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ‘ఈ ఎన్నికల్లో గెలుపొందకపోతే రాజకీయాలే వేస్ట్' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ఇంతటితో ఆగలేదు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఎంఐఎంను పాతబస్తీలో నిలువరించేందుకు నాటి హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ తన శక్తియుక్తులు ఉపయోగించారు.
నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై బాబు
ఎంసీహెచ్లో చివరకు కొన్ని డివిజన్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కలు తారుమారు అయ్యాయని వదంతులు వచ్చాయి. చివరి దశలో ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్గా ప్రస్తుత ఎమ్మెల్యే తీగల క్రుష్ణారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే ఈనాడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితంపై దేశమంతా చర్చ జరుగాలని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు ఈ ఎన్నికలో గెలుపొందేందుకు అవసరమైన వ్యూహం రచించారన్న సంగతి అర్థమవుతున్నది. మూడేళ్లుగా నంద్యాలను పట్టించుకోని చంద్రబాబు.. ప్రగతిలో భాగంగానే నంద్యాలలో భారీగా పథకాలు అమలు చేశామని పదేపదే ప్రకటించుకున్నారు. కనుక ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలే వేరు మరి. అదీ సంగతి.