కాకినాడలో నేడు సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష:భారీ ఏర్పాట్లు
Recommended Video
కాకినాడ:విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సిఎం చంద్రబాబు నేతృత్వంలో టిడిపి ధర్మ పోరాట దీక్ష నిర్వహించనుంది.
అనైతికంగా జరిగిన రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఏపీని ఆదుకుంటామన్న భాజపా అధికారంలోకి వచ్చాక మోసం చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఈ ధర్మపోరాట దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జేఎన్టీయూకే క్రీడా మైదానంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
మూడు గంటల నుంచి మంత్రులు, ఎంపీలు, ఇతర పార్టీ ముఖ్య నేతల ప్రసంగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందని టిడిపి శ్రేణులు తెలిపాయి. అనంతరం సాయంత్రం అయిదు గంటల తరువాత చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించి సుమారు గంటన్నర పాటు కొనసాగిస్తారని సమాచారం. మరోవైపు కనీసం లక్ష మంది హాజరుతో ఈ ధర్మపోరాట దీక్షను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీలను నియమించారు.
గురువారం సభా ప్రాంగణంలో ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు పర్యవేక్షించారు.హెలిపాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రహదారులకు ఇరువైపులా పసుపు తోరణాలను ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కన చెట్లను రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మరోవైపు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి జేఎన్టీయూ వరకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా శుక్రవారం ఉదయం నుంచే కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటింపచేశారు.