సీఎం చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం...యూఎన్ జనరల్ అసెంబ్లీలో కీలకోపన్యాసం చేసే అవకాశం
Recommended Video
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది.
వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సెప్టెంబరు 24న న్యూయార్క్లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎం చంద్రబాబుకు యూఎన్ఓ సదస్సులో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది.
సెప్టెంబర్ 24 న న్యూయార్క్లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగే సదస్సుకు హాజరై ''ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్'' అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు యూఎన్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్తెయిమ్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.
దీంతో వచ్చే నెల 24న యూఎన్ఓ సదస్సులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించిన నేపథ్యంలో సిఎం చంద్రబాబుకు ఈ అరుదైన అవకాశం లభించినట్లు తెలుస్తోంది. ఏపీలో అనుసరిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి గతంలో న్యూయార్క్ టైమ్స్లో ఓ ప్రత్యేక కథనం కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది సుమారు రూ.2500 కోట్లు వెచ్చిస్తోందంటూ ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. 2024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగు బాట పట్టించాలని ఎపి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి యూఎన్ఓ తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ సూచనలతో ఎపి సిఎం చంద్రబాబు రాష్ట్రంలో పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నవారికి చంద్రబాబు తన గళం వినిపించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఈ సదస్సుకు పర్యావరణ విభాగం, మహిళా విభాగం, బీఎన్పీ పారిబాస్, ప్రపంచ ఆగ్రోఫారెస్ట్రీ కేంద్రం, పలు ఇతర సంస్థలు హాజరవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాలగ్ొనేందుకు న్యూయార్క్ వెళుతున్న చంద్రబాబు అనంతరం న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారని తెలిసింది.