మనిషికి ఆధార్...భూమికి భూధార్:సిఎం చంద్రబాబు;దేశంలోనే తొలిసారి
అమరావతి:మనిషికి ఆధార్ కార్డ్ ఎలా ఉపయోగపడుతుందో...అదే విధంగా భూమిని గుర్తించడానికి భూధార్ కార్డ్ అంతలా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్ భవనంలో గురువారం ఆయన "భూసేవ" పథకాన్ని ప్రారంభించారు.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ "భూసేవ" ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రారంభించారు. మొదటగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాల్టీ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ పథకం అమలు కానుంది. భూమికి సంబంధించి అన్ని ప్రభుత్వశాఖల సేవలను ఏకతాటిపై తీసుకొచ్చేవిధంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు.
సిఎం చంద్రబాబు...ఏమన్నారంటే?
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...భూమికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఏకతాటిపై తీసుకురావటమే దీని ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభతరంగా అందేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ విధానంలో ప్రతి భూమికి అంటే పట్టణాలు,పంచాయతీల్లోని ప్రతి ఆస్తికీ 11 అంకెల భూధార్ సంఖ్య కేటాయించబడుతుందన్నారు.
రెండు కేటగిరీల్లో...భూధార్
అలాగే ఈ భూసేవ పథకంలోనే భూధార్ కార్డు ప్రవేశపెట్టామని...భూములకు సంబంధించి తాత్కాలిక భూధార్, శాశ్వత భూధార్ అనే రెండు కేటగిరీల్లో ఈ భూధార్ సంఖ్య కేటాయింపు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీనికి రెవెన్యూ, పురపాలక, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, అటవీ శాఖలను అనుసంధానించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఈ భూధార్ కార్డు ద్వారా 20 రకాల సేవలు భూ యజమానులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్డు కలిగివుండటం ద్వారా భూ యాజమాన్య మార్పిడిలో ఎటువంటి అక్రమాలకు అవకాశం ఉండదన్నారు.
భూ సేవల్లో...ఇవి కొన్ని
ప్రభుత్వం ప్రారంభించిన ఈ భూసేవ లో భూధార్ కేటాయింపు, భూధార్ నవీకరణ, భూ ప్రాథమిక సమాచారం, ముందుస్తు భూ సమాచారం, భూ యాజమాన్య మార్పిడి, భూ యాజమాన్య మార్పిడి (అర్బన్), భూ యాజమాన్య మార్పిడి (పంచాయతీ), ఆథరైజేషన్ సేవ, వ్యవసాయేతర ఉపయోగాలకు భూ మార్పిడి, ఆథరైజేషన్ సేవ, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, మార్కెట్ విలువ, ధ్రువీకరించిన లేఔట్స్ సమాచారం, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువల తాజా మదింపు, పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాల నిర్వహణ, మోనిటరింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డ్యూటీ, అటవీ హక్కుల రికార్డుల సమాచారం (ఆర్.ఒ.ఎఫ్.ఆర్), అటవీ సరిహద్దు వివాదాల తీర్మానం, డీడ్స్కు సంబంధించి ప్రత్యేకించిన సమాచారం మొదలైనవన్నీ పొందవచ్చాన్నారు.
తొలివిడత...తొలికార్డు
ఈ భూ సేవ కార్యక్రమం మే 30 నాటికి కృష్ణా జిల్లా అంతటికీ అందుబాటులోకి వస్తుందని, అక్టోబర్ 2 నాటికి రాష్ట్రమంతా భూసేవ ప్రాజెక్టు సేవలు అందుబాటులోకి వస్తాయని సిఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూధార్ కార్డును ఆవిష్కరించగా...మొదటి భూధార్ కార్డు కానూరి శిరీష అనే మహిళ అందుకున్నారు.