తిరుమల వివాదం:నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్, ఈవో భేటీ
అమరావతి: తిరుమల శ్రీవారి ఆలయంలోని వివాదాలు జాతీయ స్థాయికి ఎక్కడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు ఆరంభించారు. ఈ వివాదాల పరిష్కరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ తో మంగళవారం సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయంలోని అన్ని వివాదాల గురించి అంశాల వారీగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు, టిటిడి ప్రధాన అర్చకుల పదవీ విరమణకు వయోపరిమితి, స్వామివారి పోటులో తవ్వకాలు, ఆభరణాల గల్లంతు తదిదర విషయాల గురించి సీఎంకు టీటీడీ చైర్మన్,ఈవో వివరిస్తారని సమాచారం.
సోమవారం విజయవాడలో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన నిరసన సభలో ఎపి మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెన్నైలో ప్రెస్మీట్ పెట్టారు కాబట్టే వాస్తవాలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో తెలిశాయని అన్నారు. ఆయన రెండు ప్రధానాంశాలపై ప్రశ్నించినా ఇంతవరకూ వాటికి సమాధానం చెప్పలేదన్నారు. ప్రధాన అర్చకుడిని అర్థాంతరంగా విధుల నుంచి తొలగించి ఆగమ పరీక్షల్లో తప్పిన వ్యక్తికి ఆ స్థానం ఇవ్వడం దారుణమని ఐవైఆర్ ధ్వజమెత్తారు.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణదీక్షితులును టీటీడీ అన్యాయంగా తొలగించిందని, ఈ విషయమై తాను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి సోమవారం ట్విటర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.