రెండు రోజులు..నాలుగు సభలు: తృణమూల్ కోసం చంద్రబాబు ప్రచారం
కోల్కత: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోసం ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం నాలుగు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. దీనికోసం కోల్కత వెళ్లిన చంద్రబాబుకు అక్కడి విమానాశ్రయంలో తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాదరంగా స్వాగతం పలికారు.
చంద్రబాబు కోసం అప్పట్లో..
బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సహా 21 ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే అధినేత స్టాలిన్, జనతాదళ్ (సెక్యులర్) సుప్రిమో దేవేగౌడ వంటి నాయకులతో జట్టు కట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా వారిని పిలిపించుకున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు.
దీదీ కోసం బాబు ప్రచారం..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. బుధ, గురు వారాల్లో ఆయన ఆ రాష్ట్రంలో నాలుగు చోట్ల బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఝార్గ్రామ్, హాల్దియాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగించారు. గురువారం నాడు ఖరగ్పూర్, కోల్కతల్లో బహిరంగ సభలు, రోడ్షోలకు హాజరవుతారు. గతంలో సీబీఐ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేపట్టిన మూడు రోజుల నిరశన దీక్ష సహా, కోల్కతలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలోనూ చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ టు కోల్కత..
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు చంద్రబాబు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కోల్కతకు వెళ్లారు. మధ్యాహ్నం కోల్కత విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రియాన్ సాదరంగా స్వాగతం పలికారు.