కెసిఆర్ మళ్లీ తిట్టారు...ఎందుకో అర్థం కావడం లేదు;బాధ ఉండదా?:సిఎం చంద్రబాబు ఆవేదన
గుంటూరు:తెలంగాణా ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై కురిపిస్తున్న తిట్ల వర్షంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కెసిఆర్ పదే పదే తనను తిడుతున్నారని, ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా కెసిఆర్ నుద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతిగా కలిసుండాలని తాను కోరుకుంటుంటే కెసిఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన సిఎం చంద్రబాబు నకరికల్లు వద్ద గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఐదు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల కోసం చంద్రబాబు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
అసలు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసన్నారు. ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ అని గుర్తుచేసుకున్నారు. కెసిఆర్ గతంలో తనతోనే ఉన్నారని...తన అనుచరుడుగా కూడా ఉన్నారని...అలాంటి వ్యక్తి ఇప్పుడిలా తిడుతూ ఉంటే బాధ అనిపించదా అని చంద్రబాబు వాపోయారు. కెసిఆర్ పదేపదే తననే తిడుతున్నారని...అందువల్లే చాలా బాధేస్తోందని...అయినా ఫర్వాలేదని ప్రజల కోసం భరిస్తానని చంద్రబాబు చెప్పారు.
హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తానేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి, పగలు నిరంతరం నిర్విరామంగా కృషి చేశానని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ ఇలాంటివి ఎన్నో ఏర్పాటు కావడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని చంద్రబాబు వెల్లడించారు. అయితే కేసీఆర్ ఇలా ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం తెలుగు రాష్ట్రాల అభివృద్ధినే కోరుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.